జనగామ చౌరస్తా : జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. సోమవారం జనగామ పట్టణంలోని 7, 8, 9, 10 వార్డుల్లో, బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను తనిఖీ చేసి, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన వారు 3 లక్షల 66 వేల 453 మంది ఉండగా, ఇప్పటి వరకు 3 లక్షల 14 వేల 426 మందికి (85.80 శాతం) మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు.
84 వేల 873 మందికి (26.99 శాతం) రెండో డోస్ వ్యాక్సిన్ వేశారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ కేంద్రానికి సూచించిన లక్ష్యం మేరకు క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో పూర్తి చేయాలన్నారు. వ్యాక్సినేషన్ విషయమై ఇంటింటి సర్వే చేసి, వివరాలతో ఇంటి గడపలకు అంటించిన స్టిక్కర్లను కలెక్టర్ పరిశీలించారు.
వ్యాక్సిన్ సురక్షితమని, వయోవృద్ధులు, గర్భిణులు, బాలింతలు ఎటువంటి భయం లేకుండా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ప్రజలకు చేరువలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఉచితంగా టీకా అందిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శివలింగయ్య ప్రజలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో భద్రపర్చిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపం రాకుండా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఆర్డీవో మధుమోహన్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ మహేందర్, తాసీల్దార్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ కే నర్సింహ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.