సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే వస్తువుల రవాణా కోసం ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన ‘కార్గో అండ్ పార్సిల్’ సేవల ద్వారా సంస్థకు సత్ఫలితాలు వస్తున్నాయి. తక్కువ చార్జీలతో ప్రైవేట్ కొరియర్లకు దీటుగా హోండెలివరీ చేస్తుండడంతో ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. కరోనా నేపథ్యంలో కొన్ని నెలలపాటు బస్సులు నడవక ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొన్న ఆర్టీసీలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ సరికొత్త సంస్కరణ సంస్థకు ఊపిరి పోసింది. గతేడాది జూన్ 19 నుంచి గూడ్స్, పార్సిల్, కొరియర్ సేవలు ప్రారంభం కాగా, ఈ 17 నెలల కాలంలో జనగామ డిపోకు 24,602 పార్సిల్స్ బుకింగ్, డెలివరీ ద్వారా రూ.19,78,096 ఆదాయం సమకూరింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి హనుమకొండ, హైదరాబాద్, సికింద్రాబాద్, ఉప్పల్, సూర్యాపేట, సిద్దిపేట, చేర్యాల, పాలకుర్తి ప్రాంతాలకు కార్గో సేవలు అందుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో హోం డెలివరీ అవకాశం కూడా ఉన్నది. గతంలో 1 నుంచి 10 కిలోల వరకున్న పార్సిళ్లకు రూ.80 వసూలు చేయగా తాజాగా మరింత తగ్గించి రూ.55 మాత్రమే తీసుకుంటుండడంతో వినియోగదారులకు మరింత ఉపశమనం కలిగినట్లయింది.
జనగామ, డిసెంబర్ 10 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రారంభించిన కార్గో అండ్ పార్సిల్ సర్వీస్ ప్రైవేటు సంస్థలకు దీటుగా దూసుకుపోతున్నది. అతి తక్కువ కాలంలో ఎక్కువ మంది వినియోగదారులకు సేవలందించిన సంస్థగా నిలిచింది. ప్రైవేట్ కొరియర్, పార్సిల్ సంస్థల కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేస్తూ అత్యంత వేగంగా..సరుకులు భద్రంగా డెలివరీ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నది. కొవిడ్-19తో అతలాకుతలమైన ఆర్టీసీకి కార్గో సర్వీస్ సేవలు ఆర్థిక చేయూతనిస్తున్నది. సేవలు ప్రారంభమైన 17 నెలల కాలంలో జనగామ డిపో నుంచి 24,602 పార్శిళ్ల బుకింగ్, డెలివరీ ద్వారా రూ.19,78,096 ఆదాయం లభించింది. ప్యాసింజర్లను వారివారి గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ప్రజలకు చేరువైన ఆర్టీసీ గూడ్స్ రవాణా సహా కొరియర్, పార్సిల్ సేవల రంగంలోనూ తనదైన ముద్ర వేసింది. ఎక్కడి నుంచి బుక్ చేసినా హైదరాబాద్ జంట నగరాల వినియోగదారులకు ఇంటిదగ్గరకే (హోం డెలివరీ) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు లాభాల బాటలో పయనించిన జనగామ ఆర్టీసీ డిపో కార్మికుల సమ్మె, కరోనా లాక్డౌన్తో రూ.కోట్లలో నష్టపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీని గాడిలో పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనలతో సరికొత్త పథకాలతో సంస్కరణలు మొదలుపెట్టింది. 2020 జూన్ 19న ప్రారంభించిన గూడ్స్, పార్సిల్, కొరియర్ కార్గో సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో హోం డెలివరీ చేస్తున్న ప్రైవేట్ సంస్థల కంటే తక్కువ చార్జీలతో సేవలు అందిస్తున్నది.
కార్గో సేవలతో ఆదాయం
వరుస సంక్షోభంతో నష్టాల్లో కూరుకుపోయిన జనగామ ఆర్టీసీ డిపో నుంచి కార్గో సేవలు ప్రారంభించిన 17 నెలల కాలంలో రూ.19.78 లక్షలకు పైగా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకొని ఆర్ధికంగా నిలదొక్కుకుంది. ప్రత్యేక ఏజెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఆర్టీసీ జిల్లా కేంద్రం నుంచి మండలాలకు సైతం సేవలందిస్తూ కార్గో సర్వీస్ను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లారు. జనగామ నుంచి హనుమకొండ, హైదరాబాద్, సికింద్రాబాద్, ఉప్పల్, సూర్యాపేట, సిద్దిపేట, చేర్యాల, పాలకుర్తి వంటి ప్రాంతాలకు సేవలను విస్తరించారు. కార్గో బస్సు సర్వీస్ జనగామ డిపో నుంచి ఇప్పటి వరకు 33 ట్రిప్పులు తిరగడం ద్వారా రూ.1,91,480 ఆదాయం లభించింది. కార్గో వాహనంలో ఒక ట్రిప్పుకు 10 టన్నుల వరకు సరుకులు రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం పాలకుర్తి, తరిగొప్పుల, బచ్చన్నపేట, నర్మెట, దేవరుప్పుల, జఫర్గఢ్ మండలాలతోపాటు జనగామ పట్టణానికి సంబంధించి ప్రత్యేకంగా డెలివరీ పాయింను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు.
డెలివరీ చార్జీలు భారీగా తగ్గింపు..
కార్గో సేవలకు అదనంగా ఆర్టీసీ హోం డెలివరీని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కాజీపేట, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ జంట నగరాల్లో సేవలందుతున్నాయి. జనగామ డిపో నుంచి ఆయా పట్టణాలు, నగరాలకు బుక్ చేసిన వస్తువులు, సామగ్రిని ఆర్టీసీ సిబ్బంది వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి డెలివరీ చేస్తారు. అయితే ప్రారంభంలో ఉన్న ధరలను నవంబర్ 16 నుంచి సవరించిన ఆర్టీసీ తక్కువ చార్జీలతో పార్సిల్, కవర్లు ఇంటివద్దకు అందిస్తున్న సంస్థగా నిలుస్తున్నది. గతంలో 1-10 కిలోల వరకు రూ.80 వసూలు చేస్తుండగా, తాజాగా సవరించిన మేరకు రూ.55 మాత్రమే తీసుకుంటున్నారు. అదే గ్రామాల్లో అయితే 500 గ్రాముల వరకు పాత ధర రూ.30 నుంచి సవరించిన ధర కేవలం రూ.15 మాత్రమే, 501-1000 గ్రాముల వరకు గతంలో రూ.50 చార్జి ఉండగా, దీనిని రూ.25కు తగ్గించారు. కార్గో సేవలు, ఇతర సమాచారం కోసం ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవినాష్ 9154298762 నంబర్ను సంప్రదించాల్సి ఉంటుంది.
వేగంగా కార్గో సర్వీస్ సేవలు..
అత్యంత వేగంగా.. సురక్షితంగా.. సులువుగా ఆర్టీసీ గూడ్స్, పార్సిల్, కొరియర్ వంటి కార్గో సేవలను అందిస్తున్నది. ప్రజలు, వినియోగదారు లు ఈ సర్వీస్లను మ రింత సద్వినియోగం చేసుకొని ప్రభుత్వసంస్థను ఆదరించాలి. జనగామలో హోం డెలివరీ సేవలు లేకున్నా ఇక్కడి నుంచి నగరాలు, పట్టణాలకు బుక్ చేసుకుంటే హోం డెలివరీ ఇస్తున్నాం. ఆర్టీసీ కార్గో సేవలకు ప్రజల్లో మంచి స్పందన లభిస్తున్నది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు సైతం డిపాజిట్ లేకుండా అద్దె ప్రాతిపదికన బస్సులను పంపిస్తున్నాం. సేవలను మరింత విస్తరిస్తున్నాం.
-లక్ష్మీధర్మ, జనగామ డిపో మేనేజర్