రఘునాథపల్లి : రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదని, కొన్ని నెలలుగా దొడ్డు వడ్లను కొనుగోలు చేయమని చెప్పడం తెలంగాణకు గొడ్డలి పెట్టులాంటిందని మాజీడిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని వెల్ది గ్రామానికి చెందిన చెరుకు అయోద్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అదే గ్రామానికి చెందిన నక్కిరెడ్డి జయపాల్రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఆయన సోమవారం బాధితుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పు తెచ్చి ఐకేపీ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలస్తుందన్నారు.
తెలంగాణలోని బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దొడ్డు వడ్లు కొనుగోలు చేయించేందుకు కృషి చేయాలన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రిని కలిసి దొడ్డు వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని వినతి పత్రం అందించినా స్పందించడలేదని గుర్తు చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ యాత్రను మానుకొని ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని ఒప్పించి దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేసేందుకు ఒప్పించాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రపంచమే అబ్బుర పడే విధంగా అతి తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిందన్నారు.
గడిచిన ఏడు సంవత్సరాల కాలంలో సీఎం ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ధాన్యం దిగుబడి చేసుకునే స్థాయి నుంచి దేశానికి అన్నం పెట్లే స్థాయికి ఎదిగిందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు మారుజోడు రాంబాబు, మాజీ ఎంపీపీలు మల్కపురం లక్ష్మయ్య, దాసరి అనిత, టీఆర్ఎస్ నాయకులు పెండ్లి మల్లారెడ్డి, చెంచు రమేశ్, బంద కుమారస్వామి, పెంట సుమన్, పేరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.