జనగామ రూరల్ : జనగామ జిల్లాలో 18సంవత్సరాలు నిండిన వారందరికి గురువారం నుంచి వందశాతం వ్యాక్సినేషన్ కు పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసినట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య తెలిపారు.బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి నుంచి జిల్లాలో ప్రజల వద్దకే వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. జిల్లాలో 281 గ్రామాలు, 600 ఆవాసాలు ఉన్నాయని, 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 104 సబ్ సెంటర్లు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో 18సంవత్సరాల వయస్సు పైబడిన వారు 3లక్షల 89వేల 746 మంది ఉండగా, ఇందులో మొదటి డోస్ ఒక లక్షా 61వేల 913మంది, రెండవ డోస్ 48వేల 535మంది టీకాలు తీసుకున్నారని తెలిపారు.
జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 10వేల 448మందికి డోసులు ఇచ్చామన్నారు. జనాభా ప్రాతిపదికన 41-54 శాతం మందికి ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గురువారం నుంచి 104 సబ్ సెంటర్లు, హెడ్ క్వార్టర్స్లో, జనగామ పట్టణంలోని 1 నుంచి 15వార్డు వరకు గల వార్డుల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేపట్టనున్నట్లు వివరించారు. ప్రతి మండలానికి, ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారిని పర్యవేక్షణకు నియమించినట్లు వెల్లడించారు. అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో, డీఆర్డీవో, డీపీవో, సమన్వయ అధికారులుగా ఉంటారన్నారు. వ్యాక్సినేషన్ చేపట్టే గ్రామం, వార్డులలోముందస్తుగా తేదీని తెలుపుతూ టాం..టాం ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ వస్తే, ప్రాణహాని ఉండదని, త్వరగా కొలుకుంటారని ఆయన తెలిపారు.
ఈప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అందరూ భాగస్వామ్యం కావాలని, వందశాతం వ్యాక్సినేషన్ విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. ఈవ్యాక్సినేషన్ను 18సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హామీద్, జడ్పీ సీఈవో ఎల్. విజయలక్ష్మి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి మహేందర్, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ పగిడిపాటి సుగుణాకర్ రాజు, మున్సిపల్ కమిషనర్ నర్సింహ, సీపీవో ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.