జనగామ : జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంక్షేమ దవాఖానను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నకిరేకల్ నుంచి తిరిగివస్తున్న క్రమంలో మార్గమధ్యంలో జనగామ ఎంసీహెచ్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా రోగుల వద్దకు వెళ్లి దవాఖానాలో అందిస్తున్న సేవలు, ఇతర సదుపాయాలపై ఆరా తీశారు. రోగులతో ఆత్మీయంగా మాట్లాడుతూ.. దవాఖాన మొత్తం కలియదిరిగారు.
మంత్రి హరీశ్రావును చూసి రోగులు సంతోషం వ్యక్తం చేయగా.. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, సేవలపై రోగులు, వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కిట్, మందులు, భోజనం సరిగా పెడుతున్నారా? లేదా? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు లోపాలను గుర్తించిన మంత్రి అక్కడి నుంచే వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణతో ఫోన్లో మాట్లాడారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ను నివేదిక కోరిన మంత్రి.. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.