తాడ్వాయి, డిసెంబర్ 6 : మేడారం మహాజాతరలో నిరంత విద్యుత్ అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు నార్త్జోన్ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మేడారంలో పర్యటించారు. దేవాదాయశాఖ అధికారులు, పూజారులు ఆయనకు స్వాగ తం పలికి గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. గిరిజన సంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ, బెల్లం, సారె, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. జాతర పరిసరాల్లో చేపట్టే పనులను మోహన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతర పరిసరాల్లో 198 కొత్త ట్రాన్స్ఫార్మర్లు, 11కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
విధుల్లో 70 మంది ఇంజినీర్లు, 430 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు. మేడా రం, కొత్తూరు సబ్ స్టేషన్లలో గతంలో 2ఏఎమ్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్లు ఉండేవని వాటి స్థానంలో 8ఏఎమ్ కెపాసిటీ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో ట్రాన్స్ఫార్మర్ల లోడ్ తెలుసుకునేలా మొదటిసా రి జాతరలో వినియోగిస్తున్నామన్నారు. దీని వల్ల అంతరాయం కలుగకుం డా సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారన్నారు. గతంలో కమలాపురం, ములుగులో ఉన్న 133కేవీ సబ్స్టేషన్ల ద్వారా విద్యుత్ను మేడారం జాతర కు వినియోగించేదన్నారు.
ఇప్పుడు అలాంటి సమస్యలు రాకుండా గోవిందరావుపేట మండలం పస్రాలో 133కేవీ కొత్త సబ్స్టేషన్ నిర్మాణంలో ఉందన్నారు. దాని నిర్మాణానికి అనుమతులు, నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఎన్పీడీసీఎల్ సీఎండీ ప్రభాకర్రావుకు ధన్యవాదాలు తెలిపారు. ప్లేన్ ఏరియాలో పనులు కొనసాగుతాయని, వరి పంటలు కోతలు పూర్తి కాగానే పూర్తిస్థాయిలో పనులు చేపడతామని స్పష్టం చేశారు.
మహాజాతర సందర్భంగా కోటీ యాబై లక్షల రూపాయల విద్యుత్ వినియోగం జరుగనుందని, పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆయనవెంట ఎస్ఈ మల్సూర్, డీఈ మర్రిరెడ్డి, ఏడీఈ శైలేందర్కుమార్, ఏఈలు వేణుకుమార్, సబ్ ఏఈ జ్ఞానేశ్వర్, ఎస్ఎల్ఐ నర్సయ్య, ఎల్ఐ శివలింగం, జేఎల్ఎం శశికుమార్ పాల్గొన్నారు.