జనగామ చౌరస్తా, డిసెంబర్ 7: జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో వరంగల్ పోలీసు కమిషనరేట్ (వెస్ట్జోన్) పరిధిలో కాకతీయ స్టేట్ లెవెల్ కబడ్డీ చాంపియన్షిప్ 2021 పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని అన్నారు. జీవితంలో అదేవిధంగా రాణించాలని కోరారు. డిసెంబర్ 9వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనడానికి ఉమ్మడి 10 జిల్లాల నుంచి మొత్తం 15 టీంలు జనగామకు చేరుకున్నాయి. ఇందులో సీనియర్ నేషనల్ కబడ్డీ ప్లేయర్స్ బాయ్స్ టీం 10, సీనియర్ నేషనల్ కబడ్డీ ప్లేయర్స్ గర్ల్స్ టీం 5 ఉన్నాయి. తొలిరోజు వరంగల్ వర్సెస్ ఆదిలాబాద్ (పురుషులు), నిజామాబాద్ వర్సెస్ కరీంనగర్ (పురుషులు), డీసీపీ వెస్ట్జోన్ వర్సెస్ వర్ధన్నపేట ఏసీపీ (మహిళలు) టీంలు పోటీలో తలపడ్డాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి కింద పురుషుల టీంకు రూ. 60 వేల నగదు, ట్రోఫీ, మహిళల టీంకు రూ 60 వేల నగదు, ట్రోఫీ, ద్వితీయ బహుమతి కింద పురుషుల టీంకు రూ. 40 వేల నగదు, ట్రోఫీ, మహిళల టీంకు రూ 40 వేల నగదు, ట్రోఫీ, తృతీయ బహుమతి కింద రెండు పురుషుల టీంలకు రూ 20 వేల చొప్పున రూ 40 వేల నగదు, ట్రోఫీ, రెండు మహిళ టీంలకు రూ 20 వేల చొప్పున రూ 40 వేల నగదు, ట్రోఫీని అందజేయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి.