జయశంకర్ భూపాలపల్లి, జూలై 21 (నమస్తేతెలంగాణ) : టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ 24న నిర్వహించనున్న కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో విరివిగా మొక్కలు నాటేందుకు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి సమాజ హితానికి పాటుపడాలన్నారు. జిల్లా ప్రారంభమయ్యే చెన్నాపూర్ నుంచి మొదలుకొని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటాలన్నారు.
సింగరేణి కార్మికుల ఉద్యోగ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, దీంతో కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. కుల వృత్తులకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం యాదవులకు గొర్రెలు, ముదిరాజ్ కులస్తులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నదన్నారు. గొర్రె ల యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఇక నుంచి జిల్లాలో ముదిరాజ్, బెస్త కులాల వారు మాత్రమే చెరువుల్లో చేపలు పట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వారు లేని గ్రామాల్లో గిరిజనులకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ను ఇక నుంచి భూపాలపల్లి అభివృద్ధి మాత్రమే వినియోగించేందుకు సీఎం అవకాశం కల్పించినట్లు తెలిపారు. వెయ్యి క్వార్టర్ల సమీపంలోని రెండెకరాల స్థలంలో మెగా మార్కెట్ నిర్మించేందుకు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు.