95,500 మంది గుర్తింపు
ఐదు సెంటర్లలో వ్యాక్సినేషన్
గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి
వరంగల్, మే 26: నగరంలో సూపర్ స్ప్రెడర్లకు టీకాలు వేసేందుకు గ్రేటర్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం కమిషనర్ పమేలా సత్పతి కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే సూపర్ స్ప్రెడర్స్కు వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు గ్రేటర్లో ఐదు కేంద్రాలు గుర్తించినట్లు చెప్పారు. శంభునిపేటలోని ఆర్ఆర్ గార్డెన్, వరంగల్ కొత్తవాడలోని ఇన్నర్ వీల్ క్లబ్, హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్, మడికొండలోని మల్టీపర్పస్ కమ్యూనిటీహాల్, బీమారంలోని జీఎంఆర్ గార్డెన్లో సూపర్ స్ప్రెడర్స్కు టీకా సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకు పక్కా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి సెంటర్ పరిధిలో 13 డివిజన్లకు సంబంధించిన సూపర్ స్ప్రెడర్స్కు టీకాలు వేసేలా ప్రణాళికలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సెంటర్కు ఒక పర్యవేక్షణ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఆర్ఆర్ గార్డెన్ సెంటర్కు ఈఈ శ్రీనివాస్రావు, ఇన్నర్విల్ క్లబ్కు డిప్యూటీ కమిషనర్ జోనా, విష్ణుప్రియ గార్డెన్కు పన్నుల అధికారి శాంతికుమార్, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్కు డిప్యూటీ కమిషనర్ రవీందర్ యాదవ్, జీఎంఆర్ గార్డెన్కు ఈఈ ప్రవీణ్కుమార్ పర్యవేక్షణ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, జవాన్లు, మెప్మా సీవోలు, ఆర్పీలతో బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
95,500 మంది గుర్తింపు
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 95,500 మంది సూపర్ స్ప్రెడర్స్ను గుర్తించామని కమిషనర్ పమేలా సత్పతి తెలిపారు. ఇంకా సూపర్ స్ప్రెడర్స్ పరిధిలో వచ్చే వారిని గుర్తించాలని ఆమె అధికారులను ఆదేశించారు. రైతు బజార్, మాంసం, చికెన్, కూరగాయలు, పండ్లు, చేపల విక్రయదారులు, చిరు వ్యాపారులు, కిరాణా, వైన్స్, ఐరన్ అండ్ హార్డ్వేర్, క్షౌరశాలలో పని చేసే వారిని గుర్తించాలని చెపారు. ప్రతి రోజూ సెంటర్కు వెయ్యి మంది చొప్పున ఐదు వేల మందికి టీకాలు వేసేలా ప్రణాళికలు చేయాలన్నారు. సూపర్ స్ప్రెడర్స్కు తేదీ, సెంటర్ టోకెన్లు వివిధ రంగుల్లో అందజేయాలని అధికారులకు సూచించారు. టీకాలు తీసుకునే వారు సెంటర్కు టోకెన్తో పాటు ఆధార్ కార్డు తీసుకరావాలని అన్నారు. ఈ సమావేశంలో చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, కార్యదర్శి విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ జోనా, రవీందర్ యాదవ్, పన్నుల అధికారి శాంతికుమార్, ఈఈలు శ్రీనివాస్రావు, ప్రవీణ్కుమార్, డీఈలు రవికుమార్, రవీందర్, సంజయ్, శానిటరీ సూపర్వైజర్లు, భాస్కర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.