జనగామ చౌరస్తా : జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు, ఎంపీవోలు, మల్టీపర్పస్ సూపర్వైజర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సర్వే ద్వారా రూ. 3లక్షల 66వేల 453మంది 18సంవత్సరాల వయసు నిండిన వారిని గుర్తించడం జరిగిందన్నారు. వీరిలో ఇప్పటి వరకు 3లక్షల 10వేల 267మందికి (84.67శాతం) వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు.
మిగతా 56వేల 186మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఏప్రిల్ 2021నుంచి ఇప్పటి వరకు 489మంది టీబీ రోగులను గుర్తించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. టీబీ వ్యాధిగ్రస్తుల సంబంధికులను స్క్రీనింగ్ చేయాలని, అలాగే జిల్లాలో రోగ నిరోదకత శక్తి తక్కువగా ఉన్న ఒక వెయ్యి 578మంది హెచ్ఐవీ రోగులు ఉన్నట్లు, వారిని కూడా స్క్రీనింగ్ చేయాలని, ఒకవేళ వారిలో టీబీ గుర్తిస్తే, వారి సంబంధికులను స్క్రీనింగ్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు 84 రోజులలోపు చేయాల్సివుండగా, చాలా చోట్ల వందశాతం జరగట్లేదని, ఇందుకు ప్రణాళికబద్దంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.
మొదటి, రెండో పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య, మూడో, నాలుగో పరీక్షలు ఎంసీహెచ్లో జరుగాలని ఆయన అన్నారు. పరీక్షలు జరిగి రిజిస్ట్రేషన్ అయితేనే కేసీఆర్ కిట్కు అర్హత పొందుతారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గర్భిణీ దగ్గర మాతా శిశు సంరక్షణ కార్డు ఉండాలని, వీటి ప్రకారం పరీక్షలు, వ్యాక్సిన్లు, అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఇస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మహేందర్, డీపీవో రంగాచారి, డీఆర్డీవో రాంరెడ్డి, జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రాము, జిల్లా ఉప వైద్య, ఆరోగ్య అధికారులు పాల్గొన్నారు.