జనగామ, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): బాల సాహిత్య పురస్కారం విభాగంలో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరుకు చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. 1951 ఫిబ్రవరి 21న కోడూరులో జన్మించిన ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తిలో స్థిరపడ్డారు. ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్లో కొనసాగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1975లో జంతుశాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేసి 1979లో డాక్టరేట్ అందుకున్నారు. తర్వాత జువాలజీ ప్రొఫెసర్గా పరాన్న జీవులపై పరిశోధనలు చేస్తూ, చేయిస్తూ పీజీ విద్యార్థులు, పరిశోధనా విద్యార్థులకు 28ఏళ్లుగా మార్గదర్శనం చేశారు. తెలుగు రచయితగా, శాస్త్రవేత్తగా, కవి, కథా రచయితగా, నాటకకర్తగా, అనువాదకుడు, కాలమిస్టుగా, వ్యాసకర్తగా అనేక రచనలు చేశారు. సమాజంలో శాస్త్రీయ అవగాహనను పెంచేందుకు సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు, వ్యంగ్య రచనలు చేశా రు. తెలంగాణ ప్రజల భాషలో కవిత కథ చెప్పి మెప్పించి కవిగా, కథకుడిగా స్థిరపడ్డారు. భారతీయ భాషల కవిత్వాన్ని కథలను తెలుగులోకి అనువదించి తెలుగు కళ్లకు ఇరుగుపొరుగు దృశ్యాలను చూపించారు. వెండితెర కవిత్వంగా కొనియాడుతున్న భారతీయ సమాంతర సినిమాను విశ్లేషించారు.
జానపద సాహిత్య పరిశీలన చేసి విజ్ఞాన గ్రంథాలను ప్రచురించారు. తెలుగు అకాడమీ పుస్తకాలకు రచయితగా, సంపాదకుడిగానూ వ్యవహరించారు. భారతీయ వారసత్వం సంస్కృతి, విజ్ఞాన నాగరికతలు డిగ్రీ పాఠ్య గ్రంథమే అయినా సంపాదకుడిగా దాన్ని ఐఏఎస్ స్థాయి పోటీ పరీక్షలకు పనికివచ్చేలా తీర్చిదిద్దారు. దేవరాజుకు ప్రముఖ అనువాదకుడు దండమూడి మహీదర్ ‘అభినవ కొడవటిగంటి కుటుంబరావు’అని కితాబునిచ్చారు. ఫ్రెంచ్ గడ్డంతో విలక్షణంగా కనిపించే ఈ తెలుగు కవికి అనేక ప్రత్యేకతలున్నాయి. వచన కవిత్వంలో తెలంగాణ జీవద్భాష ప్రవేశపెట్టడం, తెలంగాణ ప్రజల భాషలో తొలి కథల సంపుటి ప్రచురించడం, మూఢనమ్మకాల నిర్మూలనకు కలం పట్టడం వంటివి ఉన్నాయి. ఎయిడ్స్పై అవగాహన కోసం తెలుగులో తొలి పుస్తకం రాసి కవికి సామాజిక బాధ్యత ఉండాలని నిరూపించారు. జాన్ ఎర్నస్ట్ స్టెయిన్బెక్ నవల ‘ది పెరల్’ను దేవరాజు తెలుగు పాఠకులకు మంచి ముత్యంగా అందించారు.
దేవరాజు మహారాజు 150 మంది భారతీయ కవులను, 50 మంది మరాఠి దళిత కవులను కవితాభారతి, మట్టిడుండె చప్పుళ్లు కవితా సంకలనాల ద్వారా పరిచయం చేశారు. అలాగే ఒరియా మహాకవి సీతాకాంత్ మహాపాత్ర కవితలు ఎన్నింటినో అనువదించారు. హిందీ కవి హరివంశ్రాయ్ బచ్చన్, మధుశాలిని అదే ధాటితో తెలుగులోకి తెచ్చారు. 70 మంది భారతీయ కథనికా రచయితలను హరివిల్లు, ఆంధ్రప్రభ వార పత్రిక 1991-92 వారి కథలతో సహా పరిచయం చేశారు. భారతీయ భాషల రచయితలను పరిచయం చేస్తూ స్త్రీవాద ధోరణిలో వెలువడిన వారి కథానికలను తెలుగు పాఠకులకు అందించారు. పిల్లల కోసం రాసిన చైనా జానపద కథలు నాలుగు పుస్తకాలుగా వెలువడ్డాయి. భారతీయ జానపదం 1994-96లో తేట తెలుగు అక్షరాలతో దేవరాజు మహారాజు చేసిన అనువాదాలు, పరిచయాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.