వారం రోజుల్లో ఇక్కడే ఆర్టీపీసీఆర్ పరీక్షలు
కొవిడ్ బాధితులకు కావాల్సినంత ఆక్సిజన్ ఉంది
ప్రజారోగ్యానికే సర్కారు తొలి ప్రాధాన్యం
రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి
మహబూబాబాద్, ఏప్రిల్ 28 : మహబూబాబాద్ జిల్లా ప్రధాన వైద్యశాలలో త్వరలో టీ-డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభించి, కొవిడ్ పరీక్షల ఫలితాల కోసం వరంగల్ వెళ్లే అవసరం లేకుండా వారం రోజుల్లో ఇక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. బుధవారం ఆమె హాస్పిటల్లో మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకొని, జిల్లా కలెక్టర్ వీపీ.గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రాములతో కలిసి కొవిడ్ వార్డులను పరిశీలించారు. రోగులకు చికిత్స అందిస్తున్న తీరు, వారు త్వరగా కోలుకునేందుకు అవసరమైన సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత మంత్రి విలేకరులతో మాట్లాడారు. వ్యాక్సిన్ వేసుకొని ప్రజల్లో అపోహ తొలగిద్దామనుకుంటే.. వాళ్లే క్యూలైన్లో నిల్చొని మరీ వ్యాక్సిన్ వేసుకుంటున్నారని చెప్పారు. మే 5, 6 తేదీల్లో ఇక్కడే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసేందుకు అన్ని సౌకర్యాలు సమకూర్చామని పేర్కొన్నారు. కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందడం లేదనే ప్రచారం సరైంది కాదన్నారు. కావాల్సినంత ఆక్సిజన్ ఇక్కడే ఉందన్నారు. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదనే సీఎం మనకుండడం మన అదృష్టంగా భావించాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తే కరోనా మన దరికి రాదని తెలిపారు. ఆమె వెంట జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు ఉన్నారు.