రిజర్వేషన్ కోటాకు రెట్టింపు స్థానాలు
మహిళల కోటా కంటే నాలుగు సీట్లు అధికం
గ్రేటర్ సీట్ల కేటాయింపులో టీఆర్ఎస్ సామాజిక న్యాయం
అన్ని వర్గాల్లో హర్షాతిరేకాలు
వరంగల్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరోసారి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో సమతూకం పాటించింది. గ్రేటర్లోని 66డివిజన్లలో బీసీ వర్గాలకు 20 రిజర్వ్ కాగా, మొత్తం 39స్థానాల్లో అవకాశం కల్పించింది. జనాభాకు తగినట్లుగా అవకాశాలు ఇవ్వాలని, వీలైనంత వరకు ప్రతి సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో అభ్యర్థులను ఎంపిక చేసింది. బీసీల్లోనూ ప్రతి వర్గానికి పోటీ చేసే అవకాశం కల్పించే ప్రయత్నం చేసింది. ఆ వర్గంలో అత్యంత వెనుకబడిన రజక, మేర, నాయీబ్రాహ్మణ, వారాల, దూదేకుల కులాల వా రికి సీట్లు కేటాయించింది.
37 మంది మహిళలకు..
స్థానిక సంస్థల్లో 50శాతం సీట్లు మహిళలకు ప్రభుత్వం రిజర్వ్ చేయగా ఈమేరకు సీట్ల కేటాయింపు కచ్చితంగా జరుగుతున్నది. మహిళా సాధికారత, రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం విషయంలో ముందుండే టీఆర్ఎస్, గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లోనూ ఇదే తీరులో నిర్ణయాలు తీసుకుంది. మహిళల కోటా ప్రకారం 33 సీట్లు రిజర్వు అయ్యాయి. టీఆర్ఎస్ అదనంగా నాలుగు కలిపి మొత్తం 37 స్థానాలు మహిళలకు కేటాయించింది. 2, 12, 22, 41 డివిజన్లు ఆయా వర్గాల్లో జనరల్ కేటగిరిల్లో మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించింది. 2వ డివిజన్ ఎస్టీ జనరల్కు రిజర్వు కాగా ఇక్కడ ఎస్టీ మహిళకు అవకాశం ఇచ్చింది. 41వ డివిజన్ బీసీ జనరల్కు రిజర్వ్ కాగా ఇక్కడా మహిళకే పోటీ చేసే చాన్స్ ఇచ్చింది. 22వ డివిజన్ జనరల్కు రిజర్వు కాగా ఇక్కడా మహిళకు అవకాశం ఇచ్చింది. 12వ డివిజన్ బీసీ జనరల్కు రిజర్వ్ కాగా ఇక్కడా మహిళలకు చాన్స్ ఇచ్చింది. గ్రేటర్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో టీఆర్ఎస్ సామాజిక న్యాయం పాటించడం, ముఖ్యంగా బీసీ వర్గాలకు రెట్టింపు స్థాయిలో, మహిళకు కోటా కంటే అధిక సీట్లు కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఇవి కూడా చదవండి
కొవిడ్-19పై అత్యున్నత భేటీ : రేపు ప్రధాని బెంగాల్ టూర్ రద్దు