మార్కెట్ చైర్మన్ చింతం సదానందం
కాశీబుగ్గ, మే19: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని చైర్మన్ చింతం సదానందం సూచించారు. బుధవారం ఆయన మార్కెట్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అడ్తి, ఖరీదు వ్యాపారులు, కార్మికవర్గాల అభ్యర్థన మేరకు మార్కెట్ను బంద్ చేసినట్లు తెలిపారు. దీంతో రైతులు తమ మిర్చి బస్తాలను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకొని రైతుబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ సిబ్బంది ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అర్బన్ జిల్లాలోని 25 కోల్డ్ స్టోరేజీల్లో తనిఖీలు చేసి వివరాలు సేకరించినట్లు తెలిపారు. రోజువారీ ఖాళీ వివరాలు తమకు అందిస్తే వెంటనే మిర్చి రైతులు తమ సరుకు నిల్వ చేసుకునేందుకు సమాచారం అందిస్తామన్నారు. కోల్ట్స్టోరేజీల్లో నిల్వలకు స్థలం లేదని రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోవద్దని ఆయన కోరారు. ఈ సమావేశంలో కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్, గ్రేడ్-2 కార్యదర్శి తోట చందర్రావు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.