గ్రేటర్ ఎన్నికల్లో విజయం మనదే
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఖిలావరంగల్, ఏప్రిల్ 18 : ఖిలావరంగల్ డివిజన్ను గెలుచుకుని ఇక్కడి నుంచే చరిత్ర సృష్టిద్దామని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 38వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి బైరబోయిన ఉమ నామినేషన్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా కోటలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం అభ్యర్థి ఉమ తో కలిసి బొడ్రాయికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 38వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్యాదవ్ రూ.35కోట్ల నిధులతో కోటను అభివృద్ధి చేశారన్నారు. ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉన్న దామోదర్యాదవ్ సతీమణి ఉమ టీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారని, ప్రజలు ఆశీర్వదించాలన్నారు. చారిత్రక కోటను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.
క్రీడాకారులు, వాకర్స్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ చొరవతో ప్రైవేటు వ్యక్తుల భూమిని కొనుగోలు చేస్తున్నామన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన గజ్జెల శ్యాంను స్వయంభూ శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్గా నియమిస్తామని ప్రకటించారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.