రెండో భార్య హత్యతో మొదటి భార్య హత్య వెలుగులోకి..
ఇంట్లోనే మొదటి భార్యను సమాధి చేసిన ఉన్మాది
శారీరకంగా హింసించి సెల్ఫోన్లో చిత్రీకరణ
విచారణలో ఆసక్తికర విషయాలు తెలిపిన నిందితుడు
వివరాలు వెల్లడించిన డీసీపీ వెంకటలక్ష్మి
హన్మకొండ సిటీ, మే17 : పర్వతగిరి మండలం ఏనుగల్లులో రెండో భార్యను హత్య చేసి పోలీసులకు చిక్కిన నిందితుడు విచారణలో మొదటి భార్య హత్యను బయటపెట్టాడు. దీంతో పోలీసులు కంగుతిన్నారు. హత్య వివరాలను ఈస్ట్జోన్ డీసీపీ కొల్లి వెంకటలక్ష్మి సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో వెల్లడించింది. ఏనుగల్లు చెందిన కర్నె కిరణ్(36) 2019 సంవత్సరంలో వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన ఒడపల్లి పద్మనాభం కుమార్తె అంజలి(42)ని వివాహం చేసుకున్నాడు. ఆమె అదే మండలంలోని సాధిరెడ్డిపేట గ్రామం లో ఏఎన్ఎంగా పనిచేస్తూ తల్లిగారింట్లోనే భర్తతో ఉండేది. కిరణ్ అదనపు కట్నం కోసం హింసించేవాడు. దీంతో అంజలి తల్లి తన బంగారు గొలుసును అమ్మి కొంతడబ్బు ఇచ్చింది. అయినా వేధింపులు ఆగలేదు. అత్తగారి ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వాలని వెంటపడడంతో అంజలి భర్తను తీసుకొని ఏనుగల్లుకు వచ్చింది.
ఈ క్రమంలో కిరణ్ ఉద్యోగం చేసేచోట వివాహేతర సంబంధాలు అంటగట్టడంతో అంజలి ఉద్యోగానికి వెళ్లకుం డా ఇంటి దగ్గరే ఉంటుంది. కాగా, ఇల్లు అమ్మే విషయంలో ఈ నెల 12న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి కిరణ్ అంజుబాయిపై కర్రతో దాడి చేయగా, చికిత్స పొందుతూ 14న మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిం దితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. 2013సంవత్సరంలో సంగెం మండలం గవిచర్లకు చెందిన చిలువేరు పద్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడాది కాపురం చేసిన తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో 2014లో చంపి ఇంట్లోనే సమాధి చేసి పారిపోయాడు. కొద్ది రోజులకు ఇంటికి తిరిగొచ్చిన నిందితుడిని భార్య గురించి స్థానికులు ఆరా తీయగా విడాకులు ఇచ్చినట్లు నమ్మించాడు. ఇద్దరినీ శారీరకంగా హించించిన దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందేవాడని డీసీపీ పేర్కొన్నారు. కాగా, రెండు హత్యలను ఛేదించడంతో ప్రతిభచూపిన మామునూరు ఏసీపీతోపాటు ఇన్స్పెక్టర్ కిషన్ను సీపీ అభినందించారు.