పాలకుర్తి రూరల్, మార్చి 16 : పుట్టిన గడ్డకు, పెంచిన ప్రాంతానికి పేరు తెచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన చెరిపెల్లి కీర్తన మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చదువుతూ ఇటీవల కేరళలో జరిగిన అండర్-16 సౌత్ ఇండియా టోర్నీలో ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా కీర్తన మంగళవారం హైదరాబాద్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కలువగా ఆయన సత్కరించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కీర్తన రెండు వేల మీటర్ల పరుగు పందెంలో పాల్గొని స్వర్ణ పతకం సాధించడం అభినందనీయమన్నారు. పరుగుల రాణి పీటీ ఉష స్ఫూర్తితో భవిష్యత్లో మరింతగా రాణించాలని కోరారు. ప్రభుత్వ పరంగా కీర్తనను ప్రోత్సహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబంలో జన్మించి చదువులో రాణిస్తూ ఆటల్లో ప్రతిభ చూపడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో కీర్తన తల్లిదండ్రులు చెరిపెల్లి నాగమణి, కుమారస్వామి, గూడూరు సర్పంచ్ మంద కొమురయ్య, మాజీ సర్పంచ్ మాచర్ల పుల్లయ్య, వార్డు సభ్యుడు పూజారి రమాకాంత్ గౌడ్ పాల్గొన్నారు.