వర్ధన్నపేట ఏసీపీ రమేశ్
జఫర్గఢ్, జూన్ 11 : రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని వర్ధన్నపేట ఏసీపీ రమేశ్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను శుక్రవారం వ్యవసాయ అధికారులతో కలిసి ఏసీపీ రమేశ్, పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. షాపుల్లోని విత్తనాల నిల్వ రిజిస్టర్లు, రోజూ వారి అమ్మకం బిల్లులు, గోదాముల్లోని నిల్వలు, ఎరువులు, పురుగు మందుల బాక్స్లు, ఎక్స్పైరీ తేదీలు పరిశీలించారు. అనంతరం ఏసీపీ రమేశ్ మాట్లాడుతూ రైతులకు విత్తనాలు, పురుగు మందులు అమ్మిన రసీదులపై లాట్ నంబర్, రైతుల సంతకాలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కాలం చెల్లిన విత్తనాలు, పురుగు మందులు అమ్మినా చర్యలు తప్పవని పేర్కొన్నారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆమోదం పొందిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను, పురుగు మందులు మాత్రమే రైతులకు విక్రయించాలని సూచించారు. సీఐ విశ్వేశ్వర్, ఎస్సై కిశోర్, మండల వ్యవసాయాధికారి హరిదాస్, ఏఈవోలు పాల్గొన్నారు.
అనుమతి ఉన్న విత్తనాలే విక్రయించాలి
దేవరుప్పుల : ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విత్తనాలే విక్రయించాలని మండల వ్యవసాయాధికారి రామకృష్ణ అన్నారు. మండలకేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్, ఆగ్రోస్ విక్రయ కేంద్రంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అడిగిన నాణ్యమైన విత్తనాలనే అందించాలని, విత్తనాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ధర పొందుపరిచిన రసీదు అందజేయాలని దుకాణాల యజమానులను ఆదేశించారు. నకిలీ విత్తనాలు, విడి విత్తనాలు, చినిగిన ప్యాకెట్లు అమ్మడం నేరమని తెలిపారు. అనంతరం షాపుల్లో స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్ను ఆయన పరిశీలించారు. ఏవో రామకృష్ణ వెంట ఏఈవో సాగర్ ఉన్నారు.