వైభవంగా మల్లన్నతో మేడలమ్మ, గొల్ల కేతమ్మకు వివాహం
స్వామి వారి నామస్మరణతో మార్మోగిన ఐలోని
అతి పెద్ద పట్నం వేసిన ఒగ్గు పూజారులు
ఐనవోలు ఏప్రిల్ 11 : ఐనవోలు మల్లికార్జునుడి కల్యాణం కమనీయంగా సాగింది. ఆలయ చరిత్రలో మొట్ట మొదటి సారిగా మూల విరాట్ బలిజె మేడలమ్మ, గొల్ల కేతమ్మలతో స్వామి వారి వివాహం ఫాల్గుణ మాసం చివరి ఆదివారం వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిగింది. మల్లికార్జునుడి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, పురోహితుడు ఐనవోలు మధుకర్శర్మ, వేదపండితుడు గట్టు పురుషోత్తమ శర్మ బృందం ఆధ్వర్యంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు 36 ఫీట్ల పొడవు, వెడల్పుతో పెద్ద పట్నం వేశారు. ఇది రాష్ట్రంలోనే పెద్దదని స్థానికులు పేర్కొన్నారు. మల్లన్న కల్యాణం, పెద్దపట్నం కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీ మధుమతి దంపతులు కుమార్తె రిషిత చేతుల మీదుగా ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వర్రావుకు రూ. 50,116 అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మునిగాల సంపత్కుమార్ – సరిత దంపతులు, డైరెక్టర్లు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ మజ్జిగ జయపాల్, సొసైటీ వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి చందర్రావు, స్థానిక సర్పంచ్ కుమారస్వామి, ఎంపీటీసీ కొత్తూరి కల్పన పాల్గొన్నారు.