రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు కృషి
నర్సంపేట ఏడీఏ శ్రీనివాస్
నల్లబెల్లి, జూన్ 10: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని నర్సంపేట ఏడీఏ శ్రీనివాస్ హెచ్చరించారు. జిల్లా విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గొర్రె మధు ఆధ్వర్యంలో గురువారం మండలంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏఈవో శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది హెచ్సీ భద్రయ్య ఉన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్
దామెర: నకిలీ విత్తనాలు విక్రయించే ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ షాపుల నిర్వాహకులపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని ఎంపీపీ కాగితాల శంకర్ హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన విక్రయ షాపుల నిర్వాహకులతో సమీక్షించారు. ప్రభుత్వ ఆమోదం పొందిన విత్తనాలను మాత్రమే విక్రయించాలన్నారు. రసీదు లేకుండా విక్రయిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని సూచించారు. సమావేశంలో ఏవో శ్వేత, ఏఈవోలు పవన్, శివలీల పాల్గొన్నారు.
అనుమతిలేని విత్తనాలు అమ్మొద్దు
నెక్కొండ/దుగ్గొండి: ప్రభుత్వ అనుమతిలేని విత్తనాలు అమ్మితే విత్తనచట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో అడిదెల సంపత్రెడ్డి హెచ్చరించారు. మండలంలోని రెడ్లవాడ, చంద్రుగొండ, గొల్లపల్లి, బంజరుపల్లిలోని ఫర్టిలైజర్ షాపులను ఏవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రికార్డులు, షాపుల్లో ఉన్న నిల్వలను సరిచూశారు. దుగ్గొండితోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ఫర్టిలైజర్ షాపుల్లో ఏవో దయాకర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనుమతిలేని, కల్తీ, నకిలీ విత్తనాలను రైతులకు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏఈవోలు రాజేశ్, మధు, హన్మంతు, విశ్వశాంతి పాల్గొన్నారు.