స్వచ్ఛందంగా ముందుకొస్తున్న గ్రామస్తులు
కరోనా వైరస్ కట్టడికి పాలకవర్గాల చర్యలు
శాయంపేట, మే 9: కరోనా సెకండ్ వేవ్లో గ్రామాల్లోనూ ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామసభల్లో స్థానికుల అభిప్రాయం మేరకు స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శాయంపేటలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఆదివారం మూడో రోజుకు చేరింది. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు సరుకులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వ్యాపార, వాణిజ్య దుకాణాలు, హోటళ్లు మూసివేస్తున్నారు. సర్పంచ్, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో శాయంపేటలో రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. పత్తిపాక, ప్రగతిసింగారంలోనూ లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
ప్రజలు సహకరించాలి
దామెర: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని సర్పంచ్లు కోరుతున్నారు. ఆదివారం దామెర, ల్యాదెళ్ల, పులుకుర్తి, దుర్గంపేట, తక్కళ్లపహాడ్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని మైకుల ద్వారా ప్రచారం చేశారు. ఉదయం ఆరు నుంచి 8 గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి 8 గంటల వరకు షాపులు తెరువాలని సూచించారు. అత్యవసరమైతేనే నిబంధనలు పాటిస్తూ బయటకు రావాలని సర్పంచ్లు, కార్యదర్శులు సూచించారు.
నేటి నుంచి పాపయ్యపేటలో..
చెన్నారావుపేట: పాపయ్యపేటలో సర్పంచ్ ఉప్పెర లక్ష్మి-వెంకన్న ఆదివారం పాలకవర్గ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం నుంచి జూన్ ఒకటో తేదీ వరకు స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. గ్రామంలో మాస్క్ ధరించని వారికి రూ. 200 జరిమానా విధిస్తామన్నారు. దుకాణాలు, బెల్టు షాపులు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకే తెరిచి ఉంచాలని సర్పంచ్ సూచించారు. నిబంధనలు పాటించని వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరింటికైనా బంధుమిత్రులు వస్తే గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో ఉప సర్పంచ్ మేడి వెంకన్న, ఎంపీటీసీ మొగిలి రమాదేవి-వెంకటరెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బుర్ర సుదర్శన్గౌడ్, వార్డు సభ్యులు కుండె రజిత, లింగాల కోమల, ఆకుల భాగ్యమ్మ, మండల వీరస్వామి పాల్గొన్నారు.