ఖానాపురం, మే 7: కరోనా కట్టడికి గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఖానాపురం మండలకేంద్రంలో శుక్రవారం నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే వ్యాపార వర్గాలు షాపులు తెరువాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే రూ. వెయ్యి జరిమానా విధించనున్నట్లు జీపీ పాలకవర్గం తీర్మానించింది.
లక్ష్మీపురంలో..
దుగ్గొండి: మండలంలోని లక్ష్మీపురంలో సర్పంచ్ పాండవుల సురేందర్ ఆధ్వర్యంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. గ్రామంలోని వర్తక, వాణిజ్య సంస్థలు, హోటళ్లను మూసివేశారు. ఇతర ప్రాంతాల నుంచి గ్రామంలోకి రాకుండా జీపీ సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా చూస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘించొద్దు
శాయంపేట: మండలంలోని పత్తిపాక, శాయంపేట, ప్రగతిసింగారంలో కరోనా కేసులు పెరిగిన దృష్ట్యా సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారని, ఎవరూ బయట తిరుగొద్దని ఎస్సై అకినపెల్లి ప్రవీణ్కుమార్ సూచించారు. ఉదయం 9 గంటల వరకు మాత్రమే సరుకులు కొనుగోలు చేసేందుకు సడలింపు ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన లాక్డౌన్ను పర్యవేక్షించారు. ఆయన వెంట శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి, ప్రొబేషనరీ ఎస్సై లవన్కుమార్ ఉన్నారు.
ఎల్లాయగూడెంలో నేటి నుంచి..
చెన్నారావుపేట: మండలంలోని ఎల్లాయగూడెంలో సర్పంచ్ మంద జయ శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. శనివారం నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ప్రజలు నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు. గ్రామంలో మాస్క్ ధరించని వారికి రూ. 200 జరిమానా విధిస్తామన్నారు. దుకాణాలు, బెల్టు షాపులు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే తెరిచి ఉంచాలని సూచించారు. అతిక్రమించిన వారికి రూ. 3 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఉప సర్పంచ్ కే విజయ్కుమార్, వార్డు సభ్యులు ఏ నర్సింహాచారి, జి కనుకమల్లు పాల్గొన్నారు.
మైలారంలో లాక్డౌన్కు నిర్ణయం
రాయపర్తి: మైలారంలో శనివారం నుంచి ఈ నెల 31 వరకు స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేసేందుకు శుక్రవారం జీపీ ఆవరణలో జరిగిన గ్రామసభలో నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ లేతాకుల సుమతి యాదవరెడ్డి తెలిపారు. గ్రామంలోని దుకాణాలన్నీ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే నిర్వహించుకోవాలని ఆమె కోరారు. సమావేశంలో ఉప సర్పంచ్ సారయ్య, ఎంపీటీసీ జీ వెంకన్న, కార్యదర్శి సుమలత, కారోబార్ ఉప్పలయ్య పాల్గొన్నారు.
నిబంధనలు పాటిస్తున్న ప్రజలు
సంగెం: కరోనా వైరస్ ఉధృతి పెరిగిన నేపథ్యంలో మండలకేంద్రంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో ఉదయం 6 నుంచి ఒంటిగంట వరకు దుకాణాలు తెరిచి ఉంటున్నాయి. మధ్యాహ్నం తర్వాత గ్రామంలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్నది.
గంగదేవిపల్లిలో పాక్షిక లాక్డౌన్..
గీసుగొండ: గంగదేవిపల్లిలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా 15 రోజులపాటు పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు సర్పంచ్ గోనె మల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీడీవో, పోలీసులు, రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు. గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఎవరికైనా సమస్య ఉంటే తనకు తెలుపాలన్నారు.