వరంగల్ చౌరస్తా, జూన్ 5 : కరోనాతో ఇంటి పెద్దలను కోల్పోయి ఇబ్బందిపడుతున్న పేద ఆర్యవైశ్య కుటుంబాలకు వరంగల్ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. శనివారం రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ గుప్తా జన్మదినాన్ని పురస్కరించుకొని జేపీఎన్రోడ్లోని ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు మునుగోటి రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు పాల్గొన్నారు. కరోనాతో మృతి చెందిన వారి చిత్రపటాల వద్ద నివాళులర్పించిన అనంతరం మాజీ మేయర్ పేద ఆర్యవైశ్య కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్బన్ జిల్లా పరిధిలో కరోనాతో కుటుంబ పెద్దలను కోల్పోయిన సుమారు 300 కుటుంబాలకు 25 కిలోల చొప్పున బియ్యం, 18 రకాల నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులను అందజేసినట్లు తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయిస్ అంధుల పాఠశాల విద్యార్థులకు అన్నదానం, ఎంజీఎంలో అటెండెంట్లకు, కాజీపేట రైల్వేస్టేషన్లో ఆటో కార్మికులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట సంపత్కుమార్, రాష్ట్ర మహాసభ కార్యదర్శి వంగేటి అశోక్కుమార్, అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు వీరన్న, వాసవీమాత పరపతి సంఘం కోశాధికారి గుండా పున్నంచంద్, ఎస్ఎస్ఎస్ సంఘం కోశాధికారి మారం అశోక్, టీఆర్ఎస్ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నీలా శ్రీధర్, కందికొండ ఉదయ్, నాగేందర్, సుద్దాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.