పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు
హన్మకొండ, జూన్ 4 : ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా శుక్రవారం ఆయన ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం భూగోళం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించక పరితపిస్తున్నామన్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారానే అధిగమించవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణకు మించిన సంపద లేదని, ప్రస్తుత కరోనా సమయంలో ఈ విషయం రుజువైందని ఎర్రబెల్లి తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్య వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. నాసిరకం ప్లాస్టిక్ వాడకంపై నియంత్రణ, గ్రీనరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం వంటి పథకాలను అమలు చేస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పల్లెప్రగతి, పట్టణాల అభివృద్ధికి పట్టణ ప్రగతి కార్యక్రమాలు పర్యావరణాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తున్నాయన్నారు. జీవవైవిధ్యంతో కూడిన ఆకుపచ్చని తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు.