కరోనా నిబంధనలతో జిల్లాలో వేడుకలు
ఇరుముడితో బయల్దేరి ఆలయాలకు వెళ్లినమాలధారులు
నర్సంపేట, జూన్ 4: హనుమాన్ జయంతి వేడుకలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తూ అర్చకులు పూజలు నిర్వహించారు. మాలధారులు ఇరుముడితో హనుమాన్ ఆలయాలకు బయల్దేరి వెళ్లారు. నర్సంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్ తదితర స్వాములు ఇరుముడి కట్టుకున్నారు. నర్సంపేటలోని సీతారామాంజనేయస్వామి, అభయాంజనేయస్వామి ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. అనంతరం ఇరుముడితో భద్రాచలం, విజయవాడ, కొండగట్టుకు వెళ్లి మాలల విరమణ చేశారు.
కరోనా నిబంధనలతో దర్శనం
వర్ధన్నపేట/ఖానాపురం/చెన్నారావుపేట/రాయపర్తి/నెక్కొండ: మండలకేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంతోపాటు ఇల్లంద, రాజేశ్వరాలయంలో అర్చకులు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయాలకు వెళ్లి హన్మంతుడిని దర్శించుకున్నారు. ఖానాపురం మండలం బుధరావుపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో హనుమాన్ మాలధారులు ఇరుముడి పూజలు నిర్వహించారు. 21 రోజులపాటు దీక్షలు చేసిన భక్తులు హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమణ చేశారు.
చెన్నారావుపేట మండలం కోనాపురం, చెన్నారావుపేట, ఖాదర్పేట, ఉప్పరపల్లి, జల్లి, అమీనాబాద్తోపాటు తండాల్లో మాలధారణం చేసిన భక్తులు హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమణ చేసేందుకు ఇరుముడితో కొండగట్టు, భద్రాచలం, విజయవాడలోని పుణ్యక్షేత్రాలకు తరలివెళ్లారు. భక్తులు గ్రామాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. రాయపర్తిలోని సీతారామచంద్రాస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. స్వామి వారి విగ్రహానికి చందనం వేసి తమలపాకులను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆలయంలో ఆంజనేయస్వామికి పంచామృతాభిషేకం, అష్టోత్తర స్తోత్ర పూజలు జరిపించారు. నెక్కొండలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు మండంలంలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆంజనేయస్వామి మూలవిరాట్, ఉత్సవమూర్తికి పురుషసూక్త విధానంలో మన్యసూక్త పారాయణంతో పంచామృతాభిషేకాలు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో అర్చకులు మాత్రమే ఏకాంత సేవలు నిర్వహించారు. నెక్కొండ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంతోపాటు అప్పల్రావుపేట, పనికర, చంద్రుగొండ, రెడ్లవాడలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.