సెల్ఫ్ లాక్డౌన్ అమలు చేస్తున్న గ్రామ పంచాయతీలు
అదే దారిలో వ్యాపార వర్గాలు..
నర్సంపేట, మే 4: కరోనా వైరస్ తీవ్రమవుతున్న వేళ.. గ్రామ పంచాయతీలు స్వచ్ఛంద చర్యలకు శ్రీకారం చుట్టాయి. గ్రామస్తుల అభీష్టం మేరకు సెల్ఫ్ లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. అలాగే, వ్యాపార వర్గాలు కూడా తమ సంఘాల సూచనల మేరకు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో నర్సంపేట పట్టణంలో ఇప్పటికే ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు బంద్ పాటిస్తుండగా, మంగళవారం నుంచి మీసేవ కేంద్రాలు లాక్డౌన్ విధించాయి. కరోనా కట్టడికి వారం రోజులపాటు షాపులు మూసేలా నిర్ణయం తీసుకున్నట్లు పలువురు మీసేవ సెంటర్ల నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఈనెల 20 వరకు..
చెన్నారావుపేట: మండలకేంద్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా గురువారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేయనున్నట్లు సర్పంచ్ కుండె మల్లయ్య తెలిపారు. ఈ మేరకు పాలకవర్గ సభ్యులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే వ్యాపార, వాణిజ్య సంస్థలు పని చేస్తాయని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మాస్క్ ధరించని వారికి రూ. 500 జరిమానా విధిస్తామని తెలిపారు. సమావేశంలో కార్యదర్శి బాలకిషన్గౌడ్, ఉప సర్పంచ్ కంకల మాధవి, వార్డు సభ్యులు రాసమల్ల సతీశ్, జున్నూతుల శ్రీధర్రెడ్డి, బండి ఉపేందర్, దోని మణెమ్మ, గట్ల శ్రీవిద్య, కో ఆప్షన్ సభ్యుడు మరాటి నర్సయ్య పాల్గొన్నారు.
ప్రగతిసింగారంలో..
శాయంపేట: ప్రగతిసింగారంలో మంగళవారం నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. గిర్దావర్, కార్యదర్శి కిరణ్, పోలీసులు లాక్డౌన్ను పర్యవేక్షించారు. ఉదయం గ్రామానికి చేరుకుని దుకాణాలను మూసివేయించారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని సూచించారు. పది రోజులపాటు లాక్డౌన్కు అందరూ సహకరించాలని కోరారు.
మూడెత్తుల తండాలో..
పర్వతగిరి: మండలంలోని మూడెత్తులతండాలో ఈ నెల 20 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానించినట్లు కార్యదర్శి భూక్యా సుమన్ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ. 1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దుకాణాలకు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మాత్రమే అనుమతించారు. బెల్టు షాపులు పూర్తిగా నిషేధం. గ్రామంలో రసాయనాలను పిచికారీ చేస్తున్నట్లు సర్పంచ్ జ్యోతి తెలిపారు. సమావేశంలో జీపీ అభివృద్ధి కమిటీ సభ్యుడు లకుపతి స్వామి, రెవెన్యూ సిబ్బంది బాలకొమురెల్లి, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.