విజయ డెయిరీలో 30శాతం పెరిగిన అమ్మకాలు
దేశ, విదేశాలకు ఉత్పత్తుల ఎగుమతులు
11 వేల లీటర్లకు చేరువలో పాల సేకరణ
ఉమ్మడి జిల్లాలో సభ్యులుగా8,200మంది రైతులు
లక్ష్యం 15 వేల లీటర్లు : డీడీ ప్రదీప్కుమార్
హన్మకొండ చౌరస్తా, ఏప్రిల్ 2: రోజురోజుకూ ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో విజయ పాల విక్రయాలు పెరుగుతున్నాయి. నాణ్య మైన పాలు, పాల ఉత్పత్తులు అందిస్తూ డెయిరీ ప్రజల మన్ననలు అందుకుంటోంది. సుమారు 8,200 రైతులు ప్రతి రోజూ 11 వేల లీటర్లకుపైగా పాలు పోస్తున్నారు. 15 వేల లీటర్ల పాల సేకరణే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు.
పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హన్మకొండలోని విజయ డెయిరీ ప్రజల మన్ననలు పొందుతోంది. గత సంవత్సరం జూన్లో 2,500 ఉన్న పాల ఉత్పత్తుల అమ్మకాలు 10 వేలకు చేరిందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రైవేట్ డెయిరీల పాలు, పాల ఉత్పత్తులు జిల్లాకు వస్తున్నప్పటికీ వాటికంటే నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది. దేశంలోని ఇతర రాష్ర్టాల కన్నా అత్యధికంగా లీటర్ పాలకు అదనంగా రూ.4 అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది.
11 వేలకు చేరిన పాల సేకరణ..
విజయ పాల సేకరణ జూన్లో 6 వేల లీటర్లు ఉండగా ప్రస్తుతం 11 వేలకు చేరిందని అధికారుల గ ణాంకాలు చెబుతున్నాయి. జనగామ మినహా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, భూపాల పల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచి సుమారు 8,200 మంది రైతులు పాలు పోస్తున్నారు. సుమారు 258 వరకు పాల సేకరణ కేంద్రాలు ఉండగా, అందులో పాలశీతలీకరణ కేంద్రాలు-8 ఉన్నాయి. వివిధ మండలాల్లో ఉదయం, సాయంత్రం పాలు సేకరిస్తున్నారు. వివిధ గ్రామాల రైతుల నుంచి సేకరించిన పాలను హన్మకొండ డెయిరీకి తీసుకువచ్చి శుద్ధి చేసి ప్యాకెట్లు ద్వారా విక్రయిస్తారు. వారికి వెన్న శాతాన్ని బట్టి పాల ధర చెల్లిస్తుంటారు. ప్రతి పదిహేను రోజులకోసారి బిల్లులు మంజూరు చేస్తారు. పాడి రైతుల నుంచి పాలను సేకరించడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందిస్తోంది. పండుగ సీజన్లో విక్రయాలు మరింత పెరుగుతున్నాయి.
కల్తీలకు చెక్..
కల్తీ పాలకు చెక్ పెట్టేందుకు విజయ డెయిరీ నూతన పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ మిల్క్ టెస్ట్, మిల్క్ అనలైజర్స్ ప్రతి సెంటర్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ల్యాబ్ అసిస్టెంట్, కెమికల్ టెస్టింగ్ మిషనరీ, మిల్క్స్క్రీన్ ఉంటాయి. పాడి రైతుల నుంచి పాలు సేకరించే సమయంలోనూ పరీక్షలు జరిపి కల్తీని నిరోధిస్తున్నారు. నాణ్యత, నమ్మకానికి చిరునామాగా నిలుస్తూ విజయ డెయిరీ ఇతర రాష్ర్టాలతోపాటు విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. కేవలం పాలను దిగుమతి, ఎగుమతి చేయడమే కాకుండా నోరూరించే పాల ఉత్పత్తుల తయారీలో ముందంజలో ఉంది. పాల ప్యాకెట్లు, నెయ్యి, బాదం పాలుతోపాటు వివిధ రకాల ఉత్పత్తులు జనగామ మినహా ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 47 విజయ పార్లర్లలో ప్రజలకు అందుబాటులో ఉంచింది.
ఇవి కూడా చూడండి..
పెరుగును ఇలా ఉపయోగించండి.. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టండి..!
ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?