జనగామ చౌరస్తా: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. పట్టణంలోని 28వ వార్డు గుండ్ల గడ్డ, 30వ వార్డు కూడలి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడుతూ.. సదరు వార్డులో 18 సంవత్సరాలు నిండిన వారు ఎంతమంది ఉన్నారు.? అందులో ఎంత మంది టీకా తీసుకున్నారు. తదితర వివరాలను సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు.
పట్టణంలో అన్ని వార్డుల్లో సర్వే పూర్తి చేసి, ఎంత మందికి వ్యాక్సిన్ ఇవ్వాలి, ఏఏ ప్రాంతాల్లో ఎంత మంది ఉన్నారో అనే విషయాన్ని గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు టీకాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల వద్దకే వ్యాక్సిన్ చేర్చే కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో 104 కేంద్రాలు, పట్టణ పరిధిలోని 30 వార్డుల్లో ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 3 లక్షల 89 వేల 746 మంది 18 సంవత్సరాల వయసు పైబడిన వారిని గుర్తించి, అందులో 2 లక్షల 13 వేల 850 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. కరోనా టీకా పట్ల ఎటువంటి భయం, ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.
వృద్ధులు, గర్భిణులు , బాలింతలు ఎవరైనా కూడా కరోనా టీకా తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ ఆర్డీవో మధుమోహన్, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ ఏ మహేందర్, జనగామ మున్సిపల్ కమిషనర్ నర్సింహ, వార్డు కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.