మహబూబాబాద్, డిసెంబరు 6 : ఉద్యోగులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో వ్యాక్సినేషన్పై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోస్ 94 శాతం పూర్తయిందన్నారు. రెండో డోస్ 52 శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. మొత్తంగా జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్ వినియోగించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. మున్సిపాలిటీ, జీపీల్లో మాస్క్, శానిటైజర్ వినియోగంపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు.
ప్రతి సోమవారం గ్రీవెన్స్ ద్వారా ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో స్వయంగా వినతులు స్వీకరించిన కలెక్టర్ శశాంక ఫిర్యాదులను సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ దరఖాస్తులు, కోర్టు కేసులు పెండింగ్లో ఉన్న వాటిపై శాఖల వారీగా సమీక్షిస్తూ పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు అభిలాషా అభినవ్, కొమురయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.