జనగామ : వెస్ట్ జోన్ పోలీస్ అధికారులతో వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి గురువారం నెల వారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జనగాం కలెక్టరేట్ సమావేశ ప్రాంగణంలో ఎర్పాటు చేసిన ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ వారీగా అధికారుల పనితీరు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులపై పోలీస్ కమిషనర్ ఆరా తీశారు. నమోదైన కేసుల్లో నేస్తుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై పోలీస్ కమిషనర్ సంబందిత పోలీస్ అధికారులను అడిగితెలుసుకున్నారు.
ఈ సందర్బంగా పోలీస్ అధికారులు తమ పనితీరును మెరుగుపర్చేందుకు తీసుకొవల్సిన చర్యలపై అధికారులకు సీపీ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణే లక్ష్యం అధికారులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇందు కొసం అధికారులు, సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం ద్వారా నేరానికి పాల్పడే వారిలో భయం కలుగుతుందన్నారు.
నేరాల నియంత్రించడం కోసం ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం అవసరమని, ముఖ్యంగా అధికారులు నేర దర్యాప్తు సమయంలో ఎస్.ఓ.పి పద్ధతి అనుసరించడం అవసరమని పేర్కొన్నారు.
ముఖ్యంగా చోరీలను కట్టడి కోసం కాలనీల్లో పెట్రోసిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో రాణించే విధంగా రూపొందించబడిన వర్టికల్స్ పనితీరుపై మరింత నైపుణ్యం పెంచుకోవాలని సీపీ సూచించారు.
భూకబ్జాలకు పాల్పడుతున్న వారిపై తక్షణమే కేసులను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్ల సంబంధించిన గ్యాంగ్ ల సమాచారాన్ని సేకరించి వారి కదలికపై నిఘా పెట్టాలని ఆదేశించారు.
సమావేశంలో వెస్ట్ జోన్ డిసిపి శ్రీనివాస్ రెడ్డి, ఘన్ పూర్ ఏఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఎసిపిలు వినోద్, రమేష్, ఇన్స్పెక్టర్లు బాలాజీ వరప్రసాద్, వినయ్ కుమార్, చేరాలు, శ్రీనివాస తో పాటు ఎస్.ఐలు పాల్గొన్నారు.