జనగామ చౌరస్తా : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులకు ఆదేశించారు. సోమవారం జనగామ మండలం చీటకోడురు వాగు, రిజర్వాయర్, లింగాల ఘణపురం మండలం కుందారం వాగులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. వాగుల వద్ద నిరంతర నిఘా ఉండాలని, వాహనాలు, పాదచారులు వెళ్లకుండా రహదారిని మూసి, ప్రత్యామ్నాయ దారుల గుండా ప్రజలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 0.3 సామర్థ్యం ఉన్న చీటకోడూరు రిజర్వాయర్ నిండుగా ఉందని, భారీ వర్షాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా 250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
చీటకోడూరు, కుందారం రవాణా వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్తలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రిజర్వాయర్ నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. వర్షాల వలన వాగులు, చెరువులు, నదులు పొంగే పొంగే ఆస్కారం ఉన్నందున మారుమూల ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను నీటి వద్దకు వెళ్లకుండా గ్రామాల్లో టామ్ టామ్ ప్రచారం చేయించాలని ఆదేశించారు. లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామంలోని సర్వే నంబర్ 464లో 15.15 ఎకరాలు, 465లోని 15.32 ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్రావు, జనగామ ఆర్డీవో మధుమోహన్, తాసీల్దార్లు రవీందర్, వీరస్వామి, ఇరిగేషన్ ఏఈ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.