జనగామ రూరల్, నవంబర్ 28:వరికి ప్రత్యామ్నాయంగా వేసిన కూరగాయ పంటలు రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నాయి. ఎప్పుడూ ఒకే తీరు పంట వేసి నష్టపోయే బదులు.. కొత్త పంట వేయాలనే ఆలోచన.. వారికి మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. అంతేగాక ఒకప్పుడు బీడుగా పడి ఉండే భూములకు సాగుకళ వచ్చినట్లయింది. ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉండే టమాట, క్యాబేజీ, క్యాప్సికం, కొత్తిమీర, సొరకాయ, మిర్చి, వంకాయ, బీర, కాకర, బెండ, చిక్కుడును ఎంచుకొని జనగామ మండలం సిద్దెంకి, పసరమడ్ల గ్రామాల్లో వేలాది ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఇలా ఆధునిక పద్ధతిలో తీరొక్క పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కవిడే నగేశ్, శివరాత్రి రాజు.
జనగామ మండలం సిద్దెంకి గ్రామానికి చెందిన కవిడే నగేశ్, పసరమడ్లకు చెందిన శివరాత్రి రాజు సాగులో కొత్త కొత్త ప్రయోగాలతో ముందుకు సాగుతున్నారు. రాజు వరి సాగును వదిలి ఆరెకరాల్లో కూరగాయలు వేశాడు. తక్కువ సమయంలో పంట తీస్తూ ఆశించిన దిగుబడి సాధిస్తున్నాడు. సాగునీటి సౌకర్యం సరిగా ఉండేది కాదు. వానలు కురిస్తేనే పంటలు పండేవి. అందుకే ఉన్న నీటితోనే కొత్తగా ఏదైనా చేయాలనుకున్నాడు. భార్య స్వప్నతో కలిసి నాలుగు ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు వేశాడు. టమాట, చిక్కుడు, మిర్చి, బీర, కాకర, క్యాప్సికమ్, కొత్తిమీర, సొరకాయ సాగు చేశాడు. తీగజాతి కూరగాయలకు డ్రిప్తో నీళ్లు పెడుతున్నాడు. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర చేతికి వచ్చింది. పండిన కూరగాయలను జనగామ, హైదరాబాద్ మార్కెట్లకు తరలిస్తూ లాభాలు పొందుతున్నాడు.
ప్రతిసారి వరి మాత్రమే వేసే నగేశ్.. ఇప్పుడు కూరగాయల వైపు మళ్లాడు. సిద్దెంకి గ్రామానికి చెందిన ఈ రైతు.. తన భార్య మంగతో కలిసి కూరగాయలు సాగు చేస్తున్నాడు. తొలుత కొంత స్థలంలో వేసి, ప్రస్తుతం రెండు ఎకరాల్లో పూర్తిగా కూరగాయలే పండిస్తున్నాడు. టమాట, బీరకాయ, బెండ, వంకాయ, బుడంకాయ, కాకర, చిక్కుడు వేశాడు. ముఖ్యంగా తీగజాతి కూరగాయలు పండిస్తూ చేను వద్దే అమ్ముతున్నాడు. అంతేగాక ఉదయం పూట వివిధ గ్రామాలకు వెళ్లి కూరగాయలు అమ్ముతాడు. అలాగే జనగామ మార్కెట్కు కూడా తరలిస్తాడు.
వరి కంటే కూరగాయలే నయం..
వరి కంటే కూరగాయల సాగు మంచిది. నేను మూడేండ్ల నుంచి పండిస్తున్నా. లాభాలు బాగుంటున్నాయ్. ఎంత కష్టపడితే అంత లాభం ఉంటుంది. ఎకరాల కొద్దీ వరి పండించే కంటే కూరగాయలు వేసుకుంటే చాలు. వీటికి మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది.
నాలుగెకరాల్లో వేశా..
ఇదివరకు నీళ్లు సరిగా లేక వర్షాన్ని నమ్ముకునే వరి పండించేది. పంట దిగుబడి కూడా అంతంతే వచ్చేది. అందుకే తక్కువ నీళ్లతో కూరగాయలు పండించాలనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు నాలుగెకరాల్లో కూరగాయలు వేశా. తక్కువ సమయంలో లాభాలు వచ్చే పంట వేయడం మంచిది.