మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 30 : ప్రజాసంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, ఇందుకనుగుణంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్లు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ సమైక్య పాలనలో ప్రజల సమస్యలు పట్టించుకోలేదన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్నారని తెలిపారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, ఆడబిడ్డల పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో సాయం చేస్తున్నారని ఆయన వివరించారు. దళితబంధు పథకంతో దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని శంకర్నాయక్ కార్యకర్తలకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మానుకోట పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను కంటికి రెప్ప లా కాపాడుకుంటానన్నారు. నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభకు నియోజకవర్గం నుంచి 25 వేల మందిని తరలించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, మార్నేని వెంకన్న, జడ్పీటీసీ లునావత్ ప్రియాంక, మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల శ్రీను, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లునావత్ అశోక్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్ కుమార్, యాస వెంకటరెడ్డి, ఇస్లావత్ కవితారాంజీనాయక్, వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు.