ప్రతిపాదన దశలోనే వెంకటాపురం ఓపెన్ కాస్ట్
సమగ్ర శాస్త్రీయ అధ్యయనం, రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో తదుపరి కార్యాచరణ
భూపాలపల్లి ఏరియా సింగరేణి అధికార ప్రతినిధి తుకారాం
భూపాలపల్లి, జూలై 30: ప్రపంచ వారసత్వ సంపదగా ఎంపికైన రామప్ప దేవాలయానికి సింగరేణి మైనింగ్తో ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్నవి అపోహలు, అవాస్తవాలు మాత్రమేనని భూపాలపల్లి ఏరియా సింగరేణి అధికార ప్రతినిధి అజ్మీరా తుకారాం శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో వెల్లడించారు. సింగరేణి ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపురంలో చేపట్టాలని తలపెట్టిన వెంకటాపురం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కేవలం ప్రతిపాదన దశలోనే ఉందని అన్నారు. తాజాగా యునెస్కో రామప్పను వారసత్వ సంపదగా ప్రకటించిన నేపథ్యంలో వెంకటాపురం ప్రాజెక్ట్పై మరింత సమగ్రంగా శాస్త్రీయ అధ్యయనం చేశాక, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తరువాతనే సింగరేణి సంస్థ ముందుకు వెళ్లాలని నిర్ణయించిందని తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న సింగరేణి తెలంగాణకు చెందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప దేవాలయానికి నష్టం జరిగేవిధంగా ఎలాంటి ప్రతిపాదన చేయబోదని పేర్కొన్నారు. రామప్ప పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉంటుందని, దీనిపై ఎటువంటి అపోహలకు తావులేదని, అవాస్తవాలు నమ్మవద్దని భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ టీ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారని ఆ ప్రకటనలో తుకారాం తెలిపారు.