కొవిడ్ కట్టడికి రాజకీయాలకతీతంగా ఒక్కటవ్వాలి
సీఎం కేసీఆర్ సూచనలతో తగ్గుతున్న కేసులు
కష్టకాలంలోనూ ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
టెలీకాన్ఫరెన్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
తొర్రూరు, మే 27: కరోనా కట్టడికి రాజకీయాలకతీతంగా ప్రతిఒక్కరూ కలిసిరావాలి.., కొవిడ్ బాధితులకు అండగా నిలిచి వారిలో ఆత్మైస్థెర్యం నింపాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజాప్రతినిధులకు, అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న సూచనలు, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషి ఫలితంగా రోజు వారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నదన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో కొవిడ్ బాధితులకు ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్, దాతలు, స్వచ్చంద సంస్థల సహకారంతో ప్రస్తుతం రూ.40లక్షల వరకు నిత్యావసర వస్తువులు, మాస్కులు, డ్రైఫ్రూట్స్, భోజనాలు పంపిణీ చేశామన్నారు. నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, శ్రీనిధి పథకం, బాల వికాస సంస్థలతోపాటు ఇతర సంస్థల సహకారంతో ఆక్సిజన్ బెడ్లు పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కరోనాతో పార్టీ కార్యకర్తలు, ఆత్మీయులు, బంధువులు, శ్రేయోభిలాషులను కోల్పోవడం బాధగా ఉందన్నారు. రాష్ర్టానికి వ్యాక్సిన్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్ సేకరిస్తున్నదని చెప్పారు.
సీఎం కేసీఆర్ హైదరాబాద్లోని గాంధీ వైద్యశాల, వరంగల్లోని ఎంజీఎం దవాఖానను సందర్శించి కరోనా బాధితుల యోగ క్షేమాలు తెలుసుకుని, మెరుగైన చికిత్స కోసం డాక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం వల్లే అందరికీ మెరుగైన చికిత్స అందుతున్నదని తెలిపారు. ఎంజీఎం దవాఖానను నాలుగు విడుతలు సందర్శించి కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంతటి కష్టకాలంలోనూ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఇదంతా సీఎం కేసీఆర్ చలువ అని అన్నారు. కొన్నిచోట్ల కాంగ్రెస్, బీజేపీలు రైతులను తప్పుదోవ పట్టించేందుకు ఆందోళన చేస్తున్నాయని, అమ్మాపురంలో అదే రీతిలో రైతులు రోడ్డెక్కాని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వరికి క్వింటాలుకు రూ.1200 కూడా కొనుగోలు చేయడం లేదని చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామని, రైతులు వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకోవాలని కోరారు.