తన కుంచెతో పదిలం చేసిన కొండపల్లి
యునెస్కో గుర్తింపు నేపథ్యంలో..
సిటీ బ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రామప్ప ఆలయంలోని కాకతీయ శిల్ప కళా వైభవం ఖండాంతరాలు దాటింది. అద్భుత శిల్పకళా వైభవానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కడంతో ఇప్పుడు అందరి దృష్టి రామప్ప దేవాలయం వైపు మళ్లింది. ఇక్కడి శిల్పాలు పలికించని భావం లేదు. చూపు తిప్పుకోని అద్భుత శిల్ప భంగిమలు.. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ శిల్ప కళా చరిత్రను చాటి చెప్పేందుకు కెమెరాలు అందుబాటులో లేనికాలంలోనే ప్రముఖ చిత్రకారుడు, దివంగత కొండపల్లి శేషగిరిరావు రేఖాచిత్రాల ద్వారా అక్కడి కళా వైభవాన్ని పదిలం చేశారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కిన నేపథ్యంలో 1940లో కొండపల్లి గీసిన చిత్రాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అక్కడి శిల్పాలను రేఖా చిత్రాల ద్వారా భవిష్యత్ తరాలకు అందించిన శేషగిరిరావుది మహబూబాబాద్ జిల్లా పెనుగొండ గ్రామం. రామప్పకు ప్రత్యేకత తెచ్చే చిత్రాలను గీయడమే కాకుండా ఆయన ‘కాకతీయ కళ, నా అనుభవం’ పేరిట రాసిన వ్యాసంలో అక్కడి శిల్పాలకున్న ప్రత్యేకతలను వివరించారు. కాకతీయ శిల్పాలు నాలుగు రకాలుగా ఉన్నాయని, దేవతామూర్తులు, నాట్య భంగిమలు, నరనారీ మూర్తులు, అలంకార రూపాలు బౌద్ధ, చోళ, చాళుక్య, హోయసల శిల్ప ప్రభావాలు కాకతీయ శిల్పంలో ప్రతిబింబిస్తాయన్నారు. కాకతీయ శిల్పంలో కదలిక ఎక్కువ అని, నంది విగ్రహాలను అత్యంత ఆకర్షణీయంగా మలిచినట్లు అందులో పేర్కొన్నారు. ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు రామప్ప ఆలయంలో శిల్పకళ ప్రతిబింబించే రేఖా చిత్రాలు ఇవే..!