చంపక్హిల్స్లో కోల్డ్ స్టోరేజీ
కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
కొత్త కార్యాలయాన్ని నిర్మించాలి
రైతులకు సద్దన్నం వడ్డించాలి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
జనగామ, జూలై 25 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి వరంగల్ జిల్లాకు తలమానికంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డును అభివృద్ధి చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం జనగామ మార్కెట్ యార్డు అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు. పాత యార్డు ఆవరణలో హరితహారం మొక్కల పెంపకం, అదనపు ఓపెన్షెడ్ నిర్మాణం, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న కార్యాలయ సముదాయాన్ని కూల్చివేసి కొత్తగా కార్యాలయం నిర్మించే స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న ప్రస్తుతం గోదాముల్లో నిల్వఉన్న ధాన్యాన్ని మిల్లుల్లో ఖాళీ చేయాలని, అప్పుడు వచ్చే ఏడాది వానకాలం పంటల కొనుగోలు నిల్వకు వీలుంటుందన్నారు. మార్కెట్ కొత్త కార్యాలయం నిర్మాణానికి రూ.55 లక్షలతో ప్రతిపాదనలు చేయాలని జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ మార్కెట్ కార్యదర్శి జీవన్కుమార్ను ఆదేశించారు.
జనగామ మార్కెట్ స్థాయి పెంచి రైతులకు సౌకర్యాలు పెంచాలని, యార్డుకు వచ్చే ప్రతి రైతు సరుకు అమ్ముకొని సంతృప్తిగా వెళ్లేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. వచ్చే సీజన్ వరకు యార్డుకు వచ్చే రైతులకు సద్దన్నం వడ్డించాలని, అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చూడాలని ఎమ్మెల్యే ఆదేశింశారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన జనగామలో కోల్డ్ స్టోరేజీ అవసరం ఉందని, ప్రస్తుతం తమ సరుకులు నిల్వ చేసుకునేందుకు వరంగల్, మహబూబాబాద్, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని, వచ్చే ఏడాది నాటికి చంపక్హిల్స్లో జనగామ మార్కెట్కు సంబంధించి కోల్డ్స్టోరేజీ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. జనగామ మార్కెట్ అభివృద్ధి, రైతుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సీఎం కేసీఆర్ను కలిసి నిధులు మంజూరు చేయిస్తానని, రైతుల పక్షపాతి అయిన కేసీఆర్ వెంటనే నిధులు ఇస్తారనే విశ్వాసం ఉం దన్నారు. ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పంట పండలేదని, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయలేదన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రూ.30 వేల కోట్లు అప్పుగా తెచ్చిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్కు చరిత్ర సృష్టించారని ఆయన అన్నారు. అక్షర సత్యాలుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కొందరు వక్రభాష్యం చెబుతున్నారని, రైతు బంధు, దళితబంధు వంటి పథకాలు చరిత్రాత్మకమన్నారు.
ఎన్నో ఏళ్లుగా దళితులు అట్టడుగున ఉన్నారని, చేతి కష్టం తప్ప పెద్దగా ఆస్తిపాస్తులు లేని నిరుపేద దళితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో నిర్ణయం తీసుకున్నారని ముత్తిరెడ్డి చెప్పారు. లక్ష కోట్ల నిధితో దళితబంధు పథకాన్ని ఆమలు చేయాలనే సీఎం సంకల్పం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలన్న నిర్ణయం స్వాగతించాలన్నారు. అయితే మేధావులు, వివిధ వర్గాల అభిప్రాయం మేరకు రాష్ట్రంలోని 20లక్షల దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షలు ఇస్తే కొంతైనా సాయం అందినట్లు అవుతుందని చెబుతున్నారని అన్నా రు. ప్రతిపక్షాలు ఆధారాలు లేకుండా ప్రజలకు పనికిరాని సొల్లు కబుర్లు చెబుతున్నాయని మండిపడ్డారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బాల్దె విజయ, మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, డీఎం నాగేశ్వరశర్మ, కార్యదర్శి జీవన్కుమార్, మార్కెట్ డైరెక్టర్లు చిన్నం నర్సింహులు, మాశెట్టి వెంకన్న, ముత్తయ్య, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, గౌరవ అధ్యక్షులు పజ్జూరి గోపయ్య, జయహరి, కౌన్సిలర్లు పాక రమ, దేవరాయి నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు గుర్రం నాగరాజు, నీల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.