పచ్చిరొట్ట.. పైరుకు బలం!
జీలుగ, పెసరు సాగు చేస్తున్న రైతులు
సబ్సిడీపై విత్తనాలు అందజేత
శాయంపేట, జూలై 25: పచ్చిరొట్ట సాగు పైరుకు బలాన్ని చేకూరుస్తుంది. రైతులు జీలుగ, జనుము, పెసరను పచ్చిరొట్టగా పొలంలో సాగు చేసి అందులోనే కలియదున్ని భూమికి కావాల్సిన పోషకాలను అందిస్తున్నారు. ప్రధానంగా వరి, మిరప పంట సాగు చేసే రైతులు ముందుగా పచ్చిరొట్ట సాగు చేస్తున్నారు. మండలంలో మైలారం, సూరంపేట, గట్లకానిపర్తి, నర్సింహులపల్లి, పత్తిపాక, జోగంపల్లి, మాందారిపేటలో జీలుగ, పెసర పంటను పచ్చిరొట్టగా సాగు చేశారు. ఇప్పటికే జీలుగ మొక్కలు ఎత్తు పెరుగగా, కొద్ది రోజుల్లో దీనిని కలియదున్నేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. భూమికి సేంద్రియ ఎరువుగా పచ్చిరొట్ట ప్రత్యామ్నాయంగా మారడంతో రైతులు దీనిపై ఆధారపడుతున్నారు.
పచ్చిరొట్టతో ఇవీ లాభాలు
పచ్చిరోట్ట వల్ల నేల గుల్లబారి వ్యవసాయ పనులు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. సూక్ష్మజీవుల సంతతి పెరుగుతుంది. దీనివల్ల మొక్కలు పోషకాలను తీసుకుంటాయి. భూ భౌతిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. మంచి నాణ్యతతో కూడిన దిగుబడి వస్తుంది. ఎకరానికి జీలుగను 12 నుంచి 16 కిలోలు వేసుకోవాలి. పెసర ఆరు నుంచి ఎనిమిది కిలోలు వేసుకోవాలి. వీటి వల్ల వచ్చే రొట్ట జీలుగ నుంచి ఎకరాకు 12 టన్నులు నేలకు అందుతుంది.
టన్ను పచ్చిరొట్టకు నాలుగు నుంచి 11 కిలోల వరకు నత్రజని లభిస్తుంది. పెసర నుంచి టన్నుకు 5 నుంచి 6 కిలోలు లభిస్తుంది. జీలుగకు 5 నుంచి 8 కిలోల నత్రజని అందుతుంది. పచ్చిరొట్ట టన్నుకు రెండు కిలోల బాస్వరం, ఏడు నుంచి పది కిలోల పొటాషియం నేలకు లభిస్తుంది. రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. వరి పంట వేసే ముందు పచ్చిరొట్ట విత్తనాలు వేసుకుని 45 రోజుల మధ్యలో నేలలో కలియదున్నుకుని, దమ్ము చేసుకుంటే పోషకాలు భూమికి అందించి తర్వాత వేసే పంటకు అందుతుంది. పచ్చిరొట్ట పెరిగిన తర్వాత రోటోవేటర్తో చిన్న ముక్కలు అవుతాయి. తర్వాత నీరు పెట్టి దమ్ము చేసుకుంటే వారం, పది రోజుల్లో కుళ్లిపోయి ఎరువుగా మారతుంది. వేసవిలో నేలను ఖాళీగా ఉంచేకంటే పచ్చిరొట్ట సాగు చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. సబ్సిడీపై జీలుగ 30 కిలోల బ్యాగు రూ. 561 లభిస్తున్నది.