పర్యావరణ పరిరక్షణకు
ప్రతిఒక్కరూ పాటు పడాలి
గ్రామాల్లో మొక్కల పంపిణీలో ప్రజాప్రతినిధుల పిలుపు
ఖానాపురం, జూన్ 25:వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఊరూరా మొక్కలు నాటుతున్నారు. మండల ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. శుక్రవారం జిల్లాలోని పలు మండలాల్లో ఎంపీపీలు, సర్పంచ్లు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చేపట్టి సంరక్షించాలని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తూరులో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేసి నాటించారు. ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో గ్రామాల్లో నేడు పచ్చదనం కనిపిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బూస రమ, అశోక్, కోటి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
నల్లబెల్లిలో..
నల్లబెల్లి : మానవ మనుగడకు చెట్లే ఆధారమని సర్పంచ్ గుగులోత్ రవళి అన్నారు. మండలంలోని ముచ్చింపులతండాలో శుక్రవారం స్థానికులకు వివిద రకాల పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ మొక్కలను నాటడంతోపాటు వాటిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుగులోత్ సురేందర్నాయక్, రామునాయక్, కార్యదర్శి అనిల్కుమార్, వార్డు సభ్యలు పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : మండల కేంద్రానికి చెందిన ముదురుకోళ్ల సారమ్మ 9వ వర్ధంతి సందర్భంగా ఆమె తనయుడు ముదురుకోళ్ల చిన్నసాంబయ్య గ్రామ శివారులో మర్రి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హరితహారంలో భాగంగా తమ తల్లి జ్ఞాపకార్ధం మొక్కను నాటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపేంద్ర పాల్గొన్నారు.
దామెరలో..
దామెర : హరితహారంలో భాగంగా మండలంలోని కోగిల్వాయిలో శుక్రవారం సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గట్ల విష్ణువర్థన్ రెడ్డి మొక్కలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు. మొక్కల పెంపకంతో వాతావరణంలో కాలుష్యం తగ్గి ఆక్సీజన్ శాతం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంగనబోయిన మౌనికాకిరణ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు అక్తర్, ఉపసర్పంచ్ గోల్కొండ సాంబయ్య, వార్డు సభ్యులు, పీఏసీఎస్ డైరెక్టర్ గుండా చంద్రమోహన్ పాల్గొన్నారు.
నర్సంపేటలో..
నర్సంపేట :: మొక్కలు నాటడడం అందరి బాధ్యత అని మండలంలోని గురిజాల సర్పంచ్ గొడిశాల మమతాసదానందం అన్నారు. హరితహారంలో భాగంగా శుక్రవారం గురిజాలలో మొక్కలు పంపిణీ చేసి నాటారు. సర్పంచ్ మాట్లాడుతూ గురిజాలను హరిత వనంగా మార్చాలని కోరారు. మొక్కలు నాటితేనే సకాలంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలు నాటాలని కోరారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజమౌళి, సిబ్బంది పాల్గొన్నారు.