బొగ్గు ఉత్పత్తిలో తాడిచెర్ల ఉపరితల గని హవా
జెన్కో విద్యుత్ సంస్థకు నిరాటంకంగా రవాణా
సామాజిక బాధ్యతగా అభివృద్ధి పనులు
మల్హర్, నవంబర్ 24: బొగ్గు ఉత్పత్తి రంగంలో ఏఎంఆర్ కంపెనీ నాల్గు సంవత్సరాలు పూర్తి చేసుకొని గురువారం నాటికి ఐదో వసంతంలోకి అడుగిడుతోంది. మారుమూల దండకారణ్యంలో 25 సంవత్సరాల జీవిత కాలం నిర్దేశితంగా తాడిచెర్ల ఓపెన్కాస్టు ప్రాజెక్టుగా అవతరించి 2017లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జెన్కో విద్యుత్ థర్మల్ కంపెనీకి ఏఎంఆర్ కంపెనీ బొగ్గు రవాణా చేస్తున్నది. రోజూ ఐదు వేల నుంచి ఆరు వేల టన్నుల బొగ్గు రవాణా చేస్తూ నెలవారీగా 1,60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతోంది. నాలుగేళ్లుగా నిరాటంకంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేస్తూ ప్రమాద రహిత కంపెనీగా ముందుకు సాగుతోంది. గని ప్రభావిత గ్రామాల్లో సామాజిక బాధ్యతగా అభివృద్ధి పనులు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటోంది. ప్రాజెక్టు చుట్టు పక్కల గ్రామాల్లో మొక్కలను నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. ప్రాజెక్టు ఆవరణతోపాటు పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు లక్ష మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను చేపడుతోంది. ఇటీవల కొవిడ్-19 విపత్తు సమయంలో కంపెనీ అధికారులు ప్రభావిత గ్రామాల ప్రజలతోపాటు కమలాపూర్ లోని పేపర్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న సుమారు 250 కర్మికుల కుటుంబాలకు మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ మలోత్ కవిత, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ చేతుల మీదుగా ఏఎంఆర్ కంపెనీ పీఆర్వో వెంకట్ నిత్యావసర సరుకులను పంపిణీ చేయించారు. జిల్లాలోని 240 జర్నలిస్టుల కుటుంబాలకు అప్పటి కలెక్టర్ కృష్ణ ఆదిత్య నిత్యావసర సరుకులను అందజేశారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సూచనల మేరకు సుమారు 300 సిమెంట్ బస్తాలను అందించినట్ల కంపెనీ అధికారులు తెలిపారు.
రక్షణతో కూడిన ఉత్పత్తే లక్ష్యం
తాడిచెర్ల ఓసీపీలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. కార్మికుల ప్రాణాలే మాకు ముఖ్యం. నాణ్యతతో కూడిన బొగ్గును వినియోగదారుడికి అందించడమే లక్ష్యం. కరోనా సమయంలో ఓసీపీ ప్రభావిత గ్రామాల సంక్షేమానికి పాటుపడ్డాం. ఆ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం. కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తున్నది.