శాకంబరీ అలంకరణలో అమ్మవారు
ఆలయంలో నవరాత్ర మహోత్సవాలు సంపూర్ణం
చివరి రోజు తల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు
మట్టెవాడ, జూలై 24 : భద్రకాళీ శరణం మమ.. శాకంబరీ మాతాకీ జై అంటున్న భక్తుల నామస్మరణతో భద్రకాళీ ఆలయం మార్మోగింది. భద్రకాళీ శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు పరిపూర్ణమయ్యాయి. శనివారం అమ్మవారు శాకంబరీగా దర్శనమిచ్చారు. అమ్మవారిని సుమారు 72 రకాల 1200 కిలోల కూరగాయలు, పండ్లతో అలంకరించారు. ఉదయం 4గంటలకు ప్రారంభమైన అలంకరణ 10గంటల వరకు సాగింది. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శాకంబరీ ఉత్సవాలకు సహకరించిన వివిధ శాఖలు, భక్తులకు ఆలయ ఈవో సునీత కృతజ్ఞతలు తెలిపారు.