ములుగు,అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి వచ్చే నెల 3వ తేది వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలుకానున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ప్రభుత్వం ఉత్తీర్ణత శాతాన్ని వెలువరించిన విషయం తెలిసిందే.. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 2051 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య అభ్యసిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాశాఖ అధికారులు 10 పరీక్ష కేం ద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు అనుమతించేందుకు ఏర్పాట్లు చేశారు. 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేస్తూ పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య బృందాలను మందులతో పాటు అత్యవసర వైద్య సదుపాయం అందుబాటులో ఉంచనున్నారు.
2051మంది విద్యార్థులకు 10 కేంద్రాల ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి 80 మంది ఇన్విజిలేటర్లను ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు నియమించారు. స్కాడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరిండెంట్, 10 మంది డిపార్టుమెంట్ అధికారులకు విధులు కేటాయించారు. ప్రతి విద్యార్థి మా స్కుతో పాటు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో 154 మందికి, వా జేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 271 మందికి, తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 110 మందికి, గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 252 మందికి, మంగపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 220 మందికి, జాకారం సామాజిక సం క్షేమ గురుకులంలో 248 మందికి, ఏటూరునాగారం గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల (బాలికలు)లో 145 మందికి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 327 మందికి, బండారుపల్లి మోడల్ స్కూల్ కళాశాలలో 247 మందికి, టీఎస్ఆర్జేసీ కళాశాల పరీక్ష కేంద్రంలో 127 మంది పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..
ములుగు జిల్లాలో రేపటి నుంచి జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. 10 పరీక్షా కేంద్రాల్లో అన్ని సైకర్యాలు కల్పించాం. కొవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులను అనుమతించేలా చర్యలు తీసుకున్నాం. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందే రావాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు. విద్యార్థులు సకాలంలో వచ్చేలా ఆర్టీసీ సహకారంతో బస్సులు సమయానుకులంగా నడించేలా చర్యలు తీసుకున్నాం. 18 ఏళ్లు నిండిన విద్యార్థులు ఎవరైనా కరోనా టీకాలు తీసుకోకుంటే చివరి రోజు వారికి పరీక్ష కేంద్రాల వద్ద టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం.