జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 23( నమస్తేతెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సమితిలో ద్విదశాబ్ది ఉత్సాహం ఊపందుకుంది. మంత్రి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశానికి జయశంకర్ భూపాపల్లి జిల్లా నుంచి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి పార్టీ ప్లీనరీ, విజయగర్జన సభల విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయడంతో మరింత జోష్ పెరిగింది. ఇప్పటికే జిల్లాలో మండల స్థాయి ముఖ్య నాయకులతో సమావేశాలు పూర్తి చేయగా, సంస్థాగత, అనుబంధ కమిటీలతో గ్రామ స్థ్దాయిలో ఆదివారం నుంచి విస్తృతంగా సమావేశాలు నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది వేడుకల ఉత్సా హం జిల్లాలో ఊపందుకుంది. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేతృత్వంలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. దీంతో నేతల్లో జోష్ మరింత పెరిగింది. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి మండల స్థాయి, ఇందిరాభవన్లో పట్టణ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు, పలు మండలాల్లో పార్టీ మండల అధ్యక్షులు ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 25న జరుగనున్న పార్టీ ప్లీనరీ సమావేశంతో పాటు వచ్చే నెల 15న వరంగల్ కేంద్రంగా నిర్వహించనున్న ద్విదశాబ్ది విజయగర్జన సభలను విజయవంతం చేయటానికి పార్టీ శ్రేణులు కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. సభకు భారీ స్థాయిలో జన సమీకరణ చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించిన నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులు పట్టణ, మండల, గ్రామ స్థాయి నూతన కమిటీలతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ముగిసిన మండల స్థాయి సమావేశాలు
టీఆర్ఎస్ పార్టి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న ప్లీనరీతో పాటు భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులను సన్నద్దం చేసేందుకు చేపట్టిన మండల స్థాయిలో ముఖ్య నాయకుల సమావేశాలు పూర్తయ్యాయి. మండల అధ్యక్షులు అందుబాటులో లేని చోట ఒకటి రెండు రోజుల్లో సమావేశాలు నిర్వహించనున్నారు.
నేటి నుంచి గ్రామస్థాయిలో..
సంస్థాగత, అనుబంధ కమిటీలతో గ్రామ స్థాయిలో ఆదివారం నుంచి విస్తృతంగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శనివారం మండల స్థాయి సమావేశాలు నిర్వహించారు. మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు గ్రామ స్థాయిలో నిర్వహించే సమావేశాల్లో తీసుకోవాల్సిన కార్యచరణను తెలియ చేసి, కార్యకర్తలను సమాయత్తం చేయనున్నారు.