మౌలిక వసతుల కల్పనతో విద్యార్థుల పరుగులు
మూతపడిన నాలుగు పాఠశాలలు పునః ప్రారంభం
భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 23: విద్యార్థులు లేక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొన్నేళ్లుగా మూసి ఉంటున్న ప్రభుత్వ పాఠశాలలకు పునర్జీవం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నందున విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి బయట పడిన తర్వాత ప్రైవేట్ విద్యాసంస్థల్లో కాకుండా సర్కారు పాఠశాలల్లో చేర్పించడానికి మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరానికి ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు దాదాపు 5000 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. ఇంకా ప్రవేశాలు పెరిగే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
నాలుగు పాఠశాలలు పునః ప్రారంభం
చిట్యాల మండలంలోని వరికోల్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2011, టేకుమట్ల మండలంలోని బూర్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2013, మహాముత్తారం మండలంలోని పర్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2017, పెగడపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2014 సంవత్సరంలో విద్యార్థులు లేక మూతపడ్డాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ పాఠశాలలను ఈనెల1న పునః ప్రారంభించారు. వరికోల్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 28, బూర్నపల్లి పభుత్వ ప్రాథమిక పాఠశాలలో 25, పర్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 25, పెగడపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు చేర్పించారు.
సర్దుబాటుతో సత్ఫలితాలు
మూతపడిన పాఠశాలలను తిరిగి తెరిచేందుకు విద్యాశాఖ నిర్ణయం మేరకు పలు పాఠశాలల్లో మిగులుగా ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలకు ఎక్కో ఉపాధ్యాయుడిని నియమించారు. వారితో గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించారు.
కళకళలాడుతున్న పాఠశాలలు
జిల్లాలోని పాఠశాలలు ప్రభుత్వ నిర్ణయం మేరకు సెప్టెంబర్ 1న ప్రారంభమైనప్పటి నుంచి విద్యార్థుల హాజరు శాతం రోజురోకుకూ పెరుగుతున్నది. జిల్లాలో సెప్టెంబర్ సగటు హాజరు శాతం 49.7 ఉండగా అక్టోబర్ 67 శాతానికి చేరింది. సాధారణ బడులతో పాటు విద్యాశాఖ పరిధిలోని ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు ప్రారంభం కావడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.