జిల్లాలో 21 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
హాజరుకానున్న 4,986 మంది విద్యార్థులు
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
నవంబర్ 2 వరకు కొనసాగనున్న ఎగ్జామ్స్
ఈసారి కొత్తగా మొబైల్ యాప్ వినియోగం
జనగామ, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ ప్రకటించగా ఈనెల 25(సోమవారం) నుంచి నవంబర్ 2వ తేదీ వరకు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2020-21 విద్యాసంవత్సరం విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసి.. సెకండియర్ విద్యార్థులకు మార్కులు పెంచుతూ మోమోలు జారీ చేసిన ప్రభుత్వం ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో బెంచీకి ఒకరు చొప్పున మాత్రమే కూర్చునేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. నిమిషయం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతి నిరాకరణ సహా ఈసారి కొత్తగా మోబైల్ యాప్ను వినియోగించి పరీక్షల నిర్వహణతో సులభతరం చేస్తున్నారు. ఓఎంఆర్ షీట్లో మాల్ప్రాక్టీస్, బ్లాంక్ బార్ కోడ్, ఆబ్సెంట్, డ్యామేజ్, బార్కోడ్, ఎయిడెడ్ క్యాండిడేట్స్ వంటి సేవలను యాప్ అందిస్తుంది.
21 పరీక్షా కేంద్రాలు..
జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణ కోసం 21 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు మొత్తం 4,986 మంది విద్యార్థులు హాజరుకానుండగా, వారిలో 2, 274 మంది బాలురు, 2,712 మంది బాలికలు ఉన్నారు. జనగామ ప్రభుత్వ బాలికల, బాలుర, సంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, శ్రీ గాయత్రి, ఎస్ఆర్ ఒకేషనల్, సాహితీ, ఏబీవీ, శ్రీవెంకటేశ్వర కోఆపరేటివ్ కాలేజీ, ఏకశిల హైస్కూల్, స్టేషన్ఘన్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, మోడల్ స్కూల్, శివునిపల్లి హైస్కూల్, నర్మెట మోడల్ స్కూల్, నర్మెట, దేవరప్పుల, కొడకండ్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, జఫర్గడ్, పాలకుర్తి గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఏడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, రెండు మోడల్ కాలేజీ, నాలుగు సోషల్ వెల్ఫేర్, ఆరు ప్రైవేట్ కాలేజీలు, ఒకటి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పరీక్షలు రాయనున్నారు. 25న సెకండ్ లాంగ్వేజ్, 26న ఇంగ్లిష్, 27న మ్యాథమెటిక్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్, 28న మ్యాథమెటిక్స్ 1బీ, జువాలజీ, హిస్టరీ, 31న ఫిజిక్స్, ఎకనామిక్స్, నవంబర్ 1న కెమిస్ట్రి, 2న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు, 3న మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు.
కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన..
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నేపథ్యంలో శనివారం జిల్లాలోని స్టేషన్ఘన్పూర్, జనగామ కేంద్రాలను డెక్ కమిటీ సభ్యులు ధర్మేంధ్ర, విద్యాసాగర్రెడ్డి సందర్శించి ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈసారి జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ పాఠశాల కేంద్రంలో ఏర్పాట్లు, వసతులపై, మరుగుదొడ్ల సౌకర్యం, శానిటేషన్ వంటి ఆంశాలను పరిశీలించి కొవిడ్ నిబంధనలు, పరీక్షా కేంద్రం వివరాలు తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు.