రూ. 52.59 లక్షలు కాజేసి, మిషన్ను కాల్చేసిన నిందితులు
రూ. 6.70 లక్షల నగదు, 23 లక్షల విలువైన ప్లాట్ కాగితాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ కోటిరెడ్డి
మహబూబాబాద్, అక్టోబర్22: మహబూబాబాద్ జిల్లా కేంద్రం, కేసముద్రంలోని పలు ఏటీఎంల నుంచి రూ. 52,59,500 లక్షలు కాజేసి, మిషన్ను కాల్చేసిన ఐదుగురు నిందుతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 6.70 లక్షల నగదు, 23 లక్షల విలువ గల 2 ప్లాట్ కాగితాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మహబూబాబాద్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ మిలిటరీ కాలనీకి చెందిన జెడల నాగరాజు రైటర్ కంపెనీలో ఏటీఎం కస్టోడియన్గా పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన రాజేందర్, ధరావత్ మహేశ్తో కలిసి యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఇండిక్యాష్, ఇండియా-1 ఏటీఎంలలో డబ్బులను పెట్టే ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కండ్లముందే ఎక్కువ డబ్బులు కనిపించడంతో వాటిని కొల్లగొట్టాలనే అత్యాశ పుట్టింది. పథకం ప్రకారం ముగ్గురు ఏటీఎంలలో డబ్బులు పెడుతూ కొంత నగదును కాజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఆర్బీఐ ఆదేశాల మేరకు ప్రతి ఏటీఎంలో డబ్బులు లేవనే బోర్డు పెట్టొద్దని నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో ఏటీఎంలకు సంబంధించిన కంపెనీ నిర్వాహకులు మిషన్లో పెట్టే నగదు, లావాదేవీలపై ఆడిట్ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం తెలిసిన నాగరాజు, రాజేందర్, మహేశ్ డబ్బులను ఒక ఏటీఎం నుంచి మరో ఏటీంలకు మార్చుతూ ఆడిట్ చేసే వారి కంట పడకుండా చేస్తున్నారు. అయితే వీరు కొల్లగొట్టిన రూ. 52.59లక్షలు సర్దుబాటు చేసుందుకు తీవ్రంగా శ్రమించినా ఇబ్బంది కలుగుతోంది. దీంతో సెక్యూరిటీ లేని ఏటీఎంను చూసి పథకం పన్నారు.
మార్వాడీ బజార్లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను ఎంచుకుని, మహబూబా బాద్కి చెందిన దాసరి కృష్ణప్రసాద్, సాయికుమార్, ఎడ్ల రాంచరణ్, గంగరబోయిన యశ్వంత్ ఏటీఎంను కాల్చి వేయాలని రూ.2 లక్షలకు సుఫారీ మాట్లాడుకున్నారు. వారు నిప్పంటించడంతో ఏటీఎం దగ్ధమైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా, కొందరు వ్యక్తులు ఏటీఎంను దహనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో కనిపించాయి. దీంతో ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి జడల నాగరాజు నుంచి రూ.23 లక్షల విలువైన 2 ప్లాట్ల కాగితాలు, రూ.5లక్షల 90 వేలు, యశ్వంత్ నుంచి రూ.30 వేలు, కృష్ణప్రసాద్ నుంచి రూ.20 వేలు, సాయికుమార్ నుంచి రూ.15 వేలు, రాంచరణ్ నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నారు. జడల నాగరాజు, కృష్ణప్రసాద్, యశ్వంత్, రాంచరణ్, సాయికుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. రాజేందర్, మహేశ్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా ఏటీఎంను దహనం చేసిన నిందితులను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అరెస్టు చేసిన టౌన్ సీఐ వెంకటరత్నం, వెంకటేశ్వరరావు, ఎస్సైలు వెంకన్న, రమాదేవితోపాటు పర్యవేక్షించిన డీఎస్పీ సదయ్యను ఎస్పీ అభినందించారు.