జనగామ చౌరస్తా, జూలై 22 : భారీ వర్షాలపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కే నిఖిల సూచించారు. గురువారం అధికారులతో కురుస్తున్న వర్షాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గురువారం రాత్రి ఏ సమయంలోనైనా 20 సెంటీ మీటర్ల భారీ వర్షపాతానికి చేరుకోవచ్చన్నారు. మరో 48 గంటల పాటు ఈ వర్షం కొనసాగే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. రిలీఫ్, పునరావాస కేంద్రాల వద్ద 24 గంటలు సిబ్బందిని కేటాయించి భోజనం, తాగునీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు రహదారులు, వంతెనలు ప్రమాదకరంగా ఉన్న చోట రాకపోకలు స్తంభింప జేసి పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నీటి పారుదల, రెవెన్యూ శాఖల సిబ్బంది సమన్వయంతో ప్రతి చెరువు, నీటి వనరులను పర్యవేక్షించాలని తెలిపారు. నీటి మట్టాల స్థాయిని ప్రతి 3 గంటలకొకసారి నివేదించాలన్నారు.
నీటి వనరుల నుంచి నీటిని విడుదల చేయాల్సి వస్తే, ముందస్తు లోతట్టు ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. చెరువులు, నీటి వనరులకు గండ్లు పడే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో చేపలు పట్టడానికి, అనుమతించ వద్దన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయిన చోట వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. ప్రకృతి విపత్తుకు సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు, ఏ చిన్న సంఘటన జరిగినా ఒకటి, రెండు ఫోటోలతో గ్రూపులో సమాచారం పోస్టు చేయాలని కలెక్టర్ తెలిపారు. పారిశుధ్యం పకడ్బందీగా చేపట్టాలని, వ్యాధులపై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఆదేశించారు. గజ ఈత గాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జనగామ డీసీపీ బీ శ్రీనివాస్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు ఏ భాస్కర్రావు, అబ్దుల్ హమీద్, ఆర్డీవోలు మధు మోహన్, కృష్ణవేణి, డీపీవో రంగాచారి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి మహేందర్, నీటిపారుదల, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ ఇంజినీర్లు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.