‘తెలంగాణ విజయ గర్జన’ సభపై దిశానిర్దేశం చేయనున్న రామన్న
ఎనిమిది నియోజకవర్గాల ముఖ్య నేతలతో భేటీ
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్నేతృత్వం
వరంగల్, అక్టోబరు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించి 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓరుగల్లులో నవంబర్ 15న నిర్వహించనున్న ‘తెలంగాణ విజయగర్జన సభ’ కోసం శ్రేణులను సిద్ధం చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్లో వరుస భేటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా నేడు నియోజవర్గాల వారీగా జరిగే సన్నాహక సమావేశాలకు ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు తరలివెళ్లారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ నేతృత్వంలో జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమం, మహబూబాబాద్, డోర్నకల్, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల సమావేశాలు జరుగనుండగా నాయకులకు మంత్రి రామన్న దిశానిర్దేశం చేయనున్నారు.
టీఆర్ఎస్ను తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు అధినేత కేసీఆర్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలను ఎన్నుకోవడంతో పాటు రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం ప్లీనరీ, టీఆర్ఎస్ను స్థాపించి 20 ఏళ్లయిన సందర్భంగా ‘విజయగర్జన సభ’ నిర్వహించాలని నిర్ణయించారు. సంస్థాగత ప్రక్రియపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలు జరుగనున్నాయి. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, మహబూబాబాద్, డోర్నకల్, భూపాలపల్లి, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యనేతలతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలోని ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశాలకు రావాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిల నుంచి ఆహ్వానాలు అందాయి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్ సమక్షంలో ఈ సమావేశాలు జరుగుతాయి. టీఆర్ఎస్ సంస్థాగత బలోపేతం, పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం, ప్లీనరీ, ప్రభుత్వం- పార్టీ వ్యవహారాల సమన్వయం వంటి అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ స్థాపించి 20 ఏండ్లయిన నేపథ్యంలో నవంబరు 15న వరంగల్ నగరంలో ‘విజయగర్జన’ పేరిట భారీ బహిరంగసభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. టీఆర్ఎస్కు మొదటి నుంచీ అచ్చి వచ్చిన వరంగల్ నగరంలో మరోసారి భారీ సభ నిర్వహిస్తుండడంతో దీని ఏర్పాట్లపైనా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లా నేతలతో చర్చించే అవకాశముంది. గతంలో వరంగల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలు విజయవంతమయ్యాయి. గత సభల కంటే ఉన్నతంగా విజయగర్జన సభను సక్సెస్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సభ నిర్వహణ, ఏర్పాట్లపై ఉమ్మడి జిల్లా నేతలకు ప్రత్యేకంగా పలు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.