జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీరాం
కృష్ణకాలనీ, అక్టోబర్ 21: రోజూ తీసుకునే ఆహారంలో అయోడిన్ ఉండేలా చూసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరాం అన్నారు. ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. కార్యక్రమానికి డీఎంహెచ్వో ముఖ్య అతిథిగా హాజరై వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం భూపాలపల్లి పీహెచ్సీలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్వో మాట్లాడారు. అయోడైజ్డ్ ఉప్పును వాడటంతో మంచి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటుందని, పిల్లల్లో సరైన పెరుగుదల, చురుకతనం, ఉత్సాహంతో పాటు జ్ఞాపకశక్తి, పెరుగుతుందన్నారు. గర్భిణుల్లో శిశువు పెరుగుదల కూడా ఉంటుందన్నారు. అయోడిన్ లోపంతో గర్భస్రావాలు అవుతాయని, మృత శిశువులు జన్మించే అవకాశం ఉంటుందని అన్నారు. ఆయోడిన్ లోపంతో వివిధ రుగ్మతలు ఏర్పాడుతాయని అన్నారు. అయోడిన్ నిత్యావసర సూక్ష్మపోషకమని, దీనిని రోజుకు 150 మిల్లీ గ్రాములు ఉపయోగించాలని అన్నారు. అయోడైజ్డ్ ఉప్పును మూత గట్టిగా ఉన్న డబ్బాల్లో నిల్వ ఉంచాలని తెలిపారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఉమాదేవి, మమతాదేవి, సీహెచ్వో ఓనపాకల రాజయ్య, మాస్ మీడీయా ఆఫీసర్ అన్వర్, సూపర్ వైజర్లు ప్రేమలత, బృంద, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
అయోడైజ్డ్ ఉప్పునే వాడాలి
ములుగురూరల్: ప్రపంచ జనాభాలో 30 శాతం మంది అయోడిన్లోపంతో బాధపడుతున్నారని, దీని నివారణకు అయోడైజ్డ్ ఉప్పునే వాడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య అన్నారు. డీఎంహెచ్వో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయోడిన్ లోపంతో థైరాయిడ్, ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. రోజూ తినే ఆహార పదార్థాల్లో అయోడైజ్డ్ ఉప్పు ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
..