స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 21 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు స్టేషన్ ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం తీర్మానం చేయగా ఆయన మాట్లాడారు. గురువారం నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. రాజయ్య మాట్లాడుతూ మార్కెట్ పాలక వర్గంలో రిజర్వేషన్లు అమలు చేశారని, ఇందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, నిరంజన్రెడ్డి, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం మార్కెట్ నూతన పాలకవర్గం మద్దతు ధరలు అమలు చేయాలని కోరారు. వ్యవసాయదారులకు, వ్యాపారులకు మార్కె ట్ పాలక వర్గం అనుసంధానంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో కమీషన్ ఏజంట్ను ఏర్పాటు చేయడానికి, పశువుల అంగడి ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మార్కెట్కు వచ్చే రైతులకోసం ఇప్పటికే టీ సెంటర్ ఏర్పాటు చేశామని, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని రాజయ్య చెప్పారు. మార్కెట్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు. రైతుల సౌకర్యం కోసం మార్కెట్ యార్డులో రూ.2.7 కోట్లతో కవర్షెడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. గత సంవత్సరం మార్కెట్కు రూ.2 కోట్ల 70 లక్షల ఆదాయం వచ్చిందని, గత మార్చి నుంచి ఇప్పటి వరకు రూ.2 కోట్ల 17 లక్షలు లభించాయన్నారు.
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి : రాజు
రైతుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని మార్కెట్ నూతన చైర్మన్ గుజ్జరి రాజు అన్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యాలకనుగుణంగా ప్రభుత్వ పథకాలు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్యతోపాటు నూతన పాలకవర్గాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి జీవన్ కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ చల్లా చందర్రెడ్డి, డైరెక్టర్లు జొన్నల సోమేశ్వర్, బత్తుల రాజన్బాబు, రంగు హరీశ్, చల్లారపు శ్యాంసుందర్, పెంతల రాజుకుమార్, తాటికాయల వరుణ్, చిగురు సరిత, ఐత సుప్రియ, కూడా డైరెక్టర్ ఆకుల కుమార్, టీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్, జఫర్గఢ్ మండలాల అధ్యక్షులు మాచర్ల గణేష్, జయపాల్రెడ్డి, జఫర్గఢ్ మండల ఇన్చార్జి మహేందర్ రెడ్డి, ఎంపీడీవో కుమారస్వామి, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి లకావత్ చిరంజీవి, జఫర్గఢ్ ఎంపీపీ రడపాక సుదర్శన్, వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య, నాయకులు అక్కనపల్లి బాలరాజు, ఇల్లందుల శ్రీనివాస్, కందుల గట్టయ్య, అజయ్రెడ్డి పాల్గొన్నారు